అంతర్జాతీయ
ఓయ్-జక్కీ మహేష్
పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య చరిత్రాత్మకంగా ఉన్న సరిహద్దు విభేదాలు ఇప్పుడు పూర్తిస్థాయి సైనిక పోరాటంగా రూపుదాల్చుతున్నాయి. డ్యూరాండ్ లైన్ వెంబడి మొదలైన ఘర్షణలు ఇప్పుడు ఇరు దేశాల ప్రధాన నగరాలపై వైమానిక దాడుల వరకు వెళ్లడం ఆసియా ఖండంలో ఆందోళన కలిగిస్తోంది. ఈ యుద్ధం కేవలం రెండు దేశాల మధ్యే కాకుండా.. పొరుగున ఉన్న భారత్, పెట్టుబడులు పెట్టిన చైనా, అగ్రరాజ్యం అమెరికా వ్యూహాలపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
చైనాకు ఎదురుదెబ్బ?
ఈ యుద్ధం వల్ల అత్యధికంగా నష్టపోయే దేశం చైనా అని విశ్లేషకులు భావిస్తున్నారు. పాకిస్తాన్లో చైనా వేల కోట్ల నిర్ధేశించిన ‘చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్’ (CPEC) ప్రాజెక్టు ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఒకవేళ పాక్ ఆర్థికంగా కుప్పకూలితే లేదా యుద్ధంలో చిక్కుకుంటే.. చైనా పెట్టిన పెట్టుబడులు బూడిదలో పోసిన పన్నీరు అవుతాయి. ఇంకా.. ఆఫ్ఘనిస్థాన్లో అపారంగా ఉన్న లిథియం, రాగి వంటి ఖనిజ సంపదను చేజిక్కించుకోవాలని చైనా వేసిన ప్లాన్లు కూడా ఈ అస్థిరత వల్ల చెదిరిపోయే అవకాశం ఉంది.

భారత్కు సవాళ్లు.. అవకాశాలు
భారత్ ఈ పరిణామాలను అత్యంత అప్రమత్తంగా గమనిస్తోంది. ఆఫ్ఘనిస్థాన్లో అస్థిరత పెరిగితే అది ఉగ్రవాద సంస్థలకు అడ్డాగా మారి భారత్ అంతర్గత భద్రతకు ముప్పుగా పరిణమించవచ్చు. అయితే, పాకిస్థాన్ తన పశ్చిమ సరిహద్దులో (ఆఫ్ఘన్ వైపు) యుద్ధంలో తలమునకలై ఉంటే, భారత్ వైపు ఉన్న సరిహద్దుల్లో (LoC) ఉగ్రవాద చొరబాట్లు మరియు ఇతర కార్యకలాపాలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇది భారత భద్రతా బలగాలకు కొంత ఊరటనిచ్చే అంశం.
అమెరికా, ఇరాన్ వ్యూహాలు
అమెరికా ప్రస్తుతం ఈ యుద్ధంలో నేరుగా తలదూర్చకపోయినా, ఈ ప్రాంతంలో తన దౌత్యపరమైన పట్టును పెంచుకోవడానికి దీనిని ఒక అవకాశంగా మార్చుకోవచ్చు. మరోవైపు, ఇరాన్ ఈ పరిస్థితులను వాణిజ్యపరంగా తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. పాకిస్థాన్ ఓడరేవులతో ఆఫ్ఘనిస్థాన్కు సంబంధాలు తెగిపోతే, ఆఫ్ఘన్ వ్యాపారమంతా భారత్ సహకారంతో నిర్మించిన ఇరాన్లోని చాబహార్ నౌకాశ్రయం వైపు మళ్లుతుంది. దీనివల్ల ఇరాన్ మరియు భారత్ రెండూ ఆర్థికంగా లాభపడతాయి.
ఆర్థికంగా చితికిపోనున్న ప్రజలు
యుద్ధం అనేది ఏ దేశానికైనా ఆర్థిక విధ్వంసాన్ని తెస్తుంది. ఇప్పటికే పాకిస్థాన్ విదేశీ రుణాల భారంతో, తీవ్ర ద్రవ్యోల్బణంతో కొట్టుమిట్టాడుతోంది. ఆ సమయంలో యుద్ధం అంటే పాక్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనం కావడమే. అటు ఆఫ్ఘనిస్థాన్ పరిస్థితి మరీ ఘోరం. సముద్ర మార్గం లేని దేశానికి ఆహార పదార్థాలు, మందుల సరఫరా పాక్ సరిహద్దుల నుంచే జరగాలి. యుద్ధం వల్ల సరిహద్దులు మూసివేస్తే ఆఫ్ఘన్ పౌరులు ఆకలితో అలమటించే ప్రమాదం ఉంది.

