హైదరాబాద్లో మోదీ పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
హైదరాబాద్, మే 10, (సీమకిరణం న్యూస్):
భాగ్యనగరంలోని హైటెక్సిటీలో గల హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ కు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీని రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి సత్కరించారు. అనంతరం.. మోదీకి వెండి నంది విగ్రహాన్ని బహుకరించారు. ఇక.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శ్రీరాముడి ప్రతిమను మోదీకి బహూకరించారు. తెలంగాణలో మౌలిక సదుపాయాల విస్తరణ, పారిశ్రామికాభివృద్ధి, రవాణా, ఆరోగ్య రంగాల పురోగతికి సంబంధించి సుమారు రూ.9,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం సహా మరికొన్ని ప్రాజెక్టులను ప్రారంభించారు.
వీటిలో రూ.3,180 కోట్లతో చేపట్టే రహదారి పనులు, రూ.2,360 కోట్లతో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఉన్నాయి. రూ.610 కోట్లతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ టెర్మినల్కు శ్రీకారం చుట్టిన మోదీ.. రూ.1,243 కోట్లతో కాజీపేట-విజయవాడ ట్రిపులింగ్ పనులను ప్రారంభించారు. అనంతరం రూ.1,700 కోట్లతో నిర్మించిన పీఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్క్ ప్రారంభత్సవంలో పాల్గొన్న ప్రధాని.. రూ.300 కోట్లతో నిర్మించిన రైలు అండర్ రైల్ బైపాస్ లైన్నూ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మోదీతో పాటు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రధాని ప్రారంభించిన ప్రాజెక్టుల్లో వరంగల్లో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటుకానున్న పీఎం మిత్ర టెక్స్టైల్ పార్క్, జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంత విస్తరణ, హైదరాబాద్-పనాజీ ఆర్థిక కారిడార్కు సంబంధించిన జాతీయ రహదారి పనులు, మల్కాపూర్లో ఇండియన్ ఆయిల్ గ్రీన్ఫీల్డ్ టెర్మినల్, హైటెక్సిటీలో ఆధునిక క్యాన్సర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వంటి కీలక ప్రాజెక్టులున్నాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో రాష్ట్రాల పాత్ర కీలకమని పేర్కొన్నారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఆధునిక మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, రహదారులు, ఆరోగ్య సేవల విస్తరణ ద్వారా రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మోదీ తెలిపారు..