సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు
కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు క్రైమ్ మార్చి 13, (సీమకిరణం న్యూస్):
ప్రముఖులపై సోషల్ మీడియా వేదికల్లో అనుచిత వ్యాఖ్యలు, అసత్య ప్రచారాలు, వ్యక్తుల గౌరవానికి భంగం కలిగించే పోస్టులు చేయడం చట్ట విరుద్ధమని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా సోషల్ మీడియాను దుర్వినియోగం చేసే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో తప్పుడు వార్తలు, ద్వేషపూరిత వ్యాఖ్యలు లేదా అసభ్యకర పోస్టులు చేసినట్లయితే గుర్తించి సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని కర్నూలు ఎస్పీ హెచ్చరించారు. జిల్లా ఎస్పీ పలు సూచనలు చేశారు. సోషల్ మీడియాలో ఎటువంటి సమాచారం అయినా నిజానిజాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే షేర్ చేయాలన్నారు. అసత్య ప్రచారాలు , ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం చట్టపరంగా శిక్షార్హం. ఇతరుల వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీసే పోస్టులు, కామెంట్లు చేయకూడదన్నారు. సామాజిక విభేదాలు, మత విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయకూడదన్నారు. అనుమానాస్పద లేదా అనుచిత పోస్టులు గమనించిన వెంటనే పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ విభాగానికి సమాచారం ఇవ్వాలన్నారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా ఉపయోగించి సమాజంలో శాంతి భద్రతలను కాపాడటంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని కర్నూల్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ కోరారు.