- విద్యావ్యవస్థలో నెల్లూరును నంబర్ వన్గా తీర్చిదిద్దుతాం : మంత్రి నారాయణ
నెల్లూరు సిటీ, జూన్ 21, (సీమకిరణం న్యూస్) :
విద్యారంగంలో నెల్లూరును రాష్ట్రంలోనే నంబర్ వన్ జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నారాయణ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి మించి అభివృద్ధి చేస్తూ, పేద విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాల విద్యను అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక మౌలిక వసతులు, స్మార్ట్ తరగతి గదులు, డిజిటల్ ల్యాబ్లు, నాణ్యమైన బోధన ద్వారా విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విద్యను అందిస్తున్నామని పేర్కొన్నారు. రూ.20 కోట్ల సీఎస్సార్ నిధులతో నెల్లూరులో ప్రభుత్వ పాఠశాలలను అత్యాధునికంగా అభివృద్ధి చేస్తున్నామని, ఒకప్పుడు మూతపడిన పాఠశాలలు నేడు కొత్త రూపుతో విద్యార్థులను ఆకర్షిస్తున్నాయని అన్నారు. అదేవిధంగా, పీ4 (Public-Private-People Partnership) విధానంపై వైఎస్సార్సీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మంత్రి నారాయణ ఖండించారు. ఈ కార్యక్రమం పూర్తిగా పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అమలు చేస్తున్నదేనని, దీనిపై జరుగుతున్న కుట్రలను ప్రజలు నమ్మవద్దని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో విద్యను అందించడం ద్వారా పేద పిల్లలకు కూడా ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.