విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం
కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 95 అర్జీలు
ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించాలని అధికారులకు ఆదేశాలు
కర్నూలు క్రైమ్, ఆగస్టు 24, (సీమకిరణం న్యూస్):
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) ద్వారా వచ్చే అర్జీలపై త్వరితగతిన స్పందించి, విచారణ జరిపి బాధితులకు చట్టప్రకారం న్యాయం చేస్తామని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టం చేశారు. సోమవారం కర్నూలు కొత్తపేట లోని 2-టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఎస్పీ నేరుగా వినతులు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మొత్తం 95 ఫిర్యాదులు నమోదయ్యాయి.
ప్రధానంగా నమోదైన కొన్ని మోసం కేసులు:
ఐటీ ఉద్యోగం పేరిట మోసం:
హైదరాబాద్లో ఐటీ సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి హైదరాబాద్కు చెందిన సల్మాన్ రూ. 3.60 లక్షలు తీసుకుని మోసం చేశాడని కర్నూలు వన్ టౌన్కు చెందిన ప్రకాష్ నాయక్ ఫిర్యాదు చేశారు.
నకిలీ బంగారం విక్రయం:
రాజస్థాన్కు చెందిన ఇద్దరు వ్యక్తులు తొలుత మంచి బంగారం శాంపిల్స్ చూపించి, రూ. 10 లక్షలు తీసుకున్నాక నకిలీ బంగారం ఇచ్చి పరారయ్యారని ఆదోని పట్టణానికి చెందిన తాహేర్ భాషా వాపోయారు.
జెప్టో ఫ్రాంచైజీ పేరుతో సైబర్ మోసం:
జెప్టో ఫ్రాంచైజీ ఇస్తామంటూ ప్రాసెసింగ్ ఫీజు, అడ్వాన్స్ పేరిట విడతలవారీగా రూ. 9.15 లక్షలు కాజేసారని, ఆ డబ్బును రికవరీ చేయాలని ఆదోని హనుమాన్ నగర్కు చెందిన సతీష్ విన్నవించారు.
ఉద్యోగాల పేరుతో దగా :
ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగం ఇప్పిస్తామని రూ. 1 లక్ష తీసుకుని మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కల్లూరు మండలం దూపాడుకు చెందిన జస్వంత్ కోరారు.
ఫైనాన్స్ సంస్థ వేధింపులు :
స్మాల్ ఫైనాన్స్ ద్వారా రూ. 6 లక్షల రుణం తీసుకుని, మిగిలిన మొత్తం చెల్లించలేకపోవడంతో ఇంటిని వేలం వేసి సీజ్ చేశారని, డబ్బులు కట్టేందుకు కొంత గడువు ఇప్పించాలని ఓర్వకల్లు మండలం ఉప్పలపాడుకు చెందిన ఆవుల పుల్లయ్య ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదులపై తక్షణమే విచారణ జరిపి న్యాయం చేయాలని సంబంధిత పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) హుస్సేన్ పీరా, సీఐలు శివశంకర్, పార్థసారథి, మస్తాన్ వలి తదితరులు పాల్గొన్నారు.