seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 12 February 2026, 11:26 am Digital Edition : SEEMA KIRANAM

లారీ & ట్రక్ డ్రైవర్లకు ఉచిత ఆరోగ్య, కంటి పరీక్షలు

లారీ మరియు ట్రక్ డ్రైవర్లకు ఉచిత ఆరోగ్య, కంటి పరీక్షలు

 

కర్నూలు ప్రతినిధి, ఫిబ్రవరి 12, (సీమకిరణం న్యూస్) :

 

రాయలసీమ ఎక్స్‌ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో, రోడ్డు భద్రత కార్యక్రమంలో భాగంగా “మేకింగ్ ది డిఫరెన్స్” ఎన్జీఓతో కలిసి కర్నూలు లారీ ఓనర్స్ అసోసియేషన్‌లో లారీ డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్లు మరియు క్లీనర్లకు ఉచిత ఆరోగ్య మరియు కంటి పరీక్షలు నిర్వహించారు. అనంతరం అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ ఎంవీఐ రవీంద్ర కుమార్, ఎంవీఐ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. సుమారు 200 మంది డ్రైవర్లకు సాధారణ ఆరోగ్య పరీక్షలు, కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలు అందజేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం మంచి కార్యక్రమమని, డ్రైవర్లు ఇలాంటి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని కోరారు. రాయలసీమ ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్టు హెడ్ మదన్మోహన్ వంగర మాట్లాడుతూ డ్రైవర్ల కోసం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి డ్రైవర్ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే ఎలాంటి ప్రమాదం జరిగినా 1033 హెల్ప్‌లైన్ నంబర్‌ను వినియోగించుకోవాలని, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.కర్నూల్ నుంచి కడప వరకు ఉన్న హైవేలో రెండు రెస్ట్ ఏరియాలు, నాలుగు ట్రక్ లే-బైలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డ్రైవర్లు అలసటగా అనిపించినప్పుడు వాహనాలను అక్కడ పార్క్ చేసి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. రెస్ట్ ఏరియాలు మరియు ట్రక్ లే-బై లొకేషన్లకు సంబంధించిన క్యూఆర్ కోడ్ కరపత్రాలను కూడా ముద్రించి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.