seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 10:05 am Digital Edition : SEEMA KIRANAM

రెరా అనుమతి లేని వెంచర్లలో ప్లాట్లు కొనొద్దు

• ప్రాజెక్టు రెరాలో నమోదైందో లేదో పరిశీలించాలి

 

• డెవలపర్లు నిబంధనలు తప్పక పాటించాలి

 

• కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలి : రెరా చైర్మన్ శివారెడ్డి

 

కర్నూలు ప్రతినిధి, ఆగస్టు 20, (సీమకిరణం న్యూస్) :

రెరా అనుమతి, నమోదు లేని వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేయవద్దని ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (ఏపీ రెరా) చైర్మన్ శివారెడ్డి సూచించారు. బుధవారం కర్నూలులోని హోటల్ కె. ఫార్చ్యూన్‌లో నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఆధ్వర్యంలో రియల్ ఎస్టేట్ రంగ ప్రతినిధులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన డెవలపర్లు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, ఇంజినీర్లు, ఆర్కిటెక్ట్‌లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెరా నిబంధనలు, ప్రాజెక్టుల నమోదు, కొనుగోలుదారుల హక్కులపై శివారెడ్డి అవగాహన కల్పించారు. రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడంతో పాటు కొనుగోలుదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు రెరా నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని ఆయన అన్నారు. ఇప్పటి వరకు ఏపీ రెరాలో తమ ప్రాజెక్టులను నమోదు చేసుకోని నిర్మాణదారులు, డెవలపర్లు వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు. ప్లాట్లు లేదా ఇతర రియల్ ఎస్టేట్ ఆస్తులు కొనుగోలు చేసే ముందు సంబంధిత ప్రాజెక్టుకు రెరా నమోదు ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని కొనుగోలుదారులకు సూచించారు. నిబంధనలకు అనుగుణంగా ఉన్న ప్రాజెక్టులనే ఎంపిక చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను నివారించవచ్చన్నారు. రియల్ ఎస్టేట్ చట్టాలు, నిబంధనలు, ప్రాజెక్టుల నమోదు, కొనుగోలుదారుల హక్కులపై అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి సదస్సులు నిర్వహిస్తున్నట్లు శివారెడ్డి తెలిపారు.