శాశ్వత హైకోర్టు బెంచ్ కర్నూలులోనే ఏర్పాటు చేయాలి
మొబైల్ బెంచ్కు మద్దతు ఇవ్వడం రాయలసీమకు అన్యాయం
ఏపీ హైకోర్టు సీనియర్ న్యాయవాది, రాయలసీమ అడ్వకేట్స్ జేఏసీ కన్వీనర్ వై. జయరాజు
“రాయలసీమ హక్కు… కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు”
కర్నూలు ప్రతినిధి, ఆగస్టు 21, (మహా జ్యోతి న్యూస్):
కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలనే డిమాండ్తో న్యాయవాదులు చేపట్టిన ఉద్యమం మరింత ఉధృతమైంది. కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఏపీ హైకోర్టు సీనియర్ న్యాయవాది, రాయలసీమ అడ్వకేట్స్ జేఏసీ కన్వీనర్ వై. జయరాజు మాట్లాడుతూ, మొబైల్ బెంచ్ లేదా సర్క్యూట్ బెంచ్ ప్రతిపాదనను రాయలసీమ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోరని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని ఆయన అన్నారు. న్యాయవ్యవస్థ వికేంద్రీకరణతో పాటు రాయలసీమ ప్రజలకు న్యాయ సేవలు సులభంగా అందుబాటులోకి రావాలంటే కర్నూలులోనే శాశ్వత బెంచ్ ఏర్పాటు చేయడం అవసరమని పేర్కొన్నారు. న్యాయవాదుల ఉద్యమానికి ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. శాశ్వత హైకోర్టు బెంచ్ సాధించే వరకు ఉద్యమం నిరంతరం కొనసాగుతుందని హెచ్చరించారు.