ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సాయి చైతన్య
తెలంగాణ రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకపక్షంగా ఫలితాలు దక్కించుకుంది. పార్టీ హైకమాండ్ ఈ ఫలితాలపై హర్షం వ్యక్తం చేస్తూనే.. రాష్ట్రంలో రాజకీయాల వేళ పార్టీ నేతలను అప్రమత్తం చేసింది. మంత్రుల మధ్య విభేదాల పైన ఆరా తీసింది. ఎంఐఎంతో ఆచి తూచి వ్యవహరించాలని సూచించింది. ఇదే సమయంలో రాజ్యసభ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి అభ్యర్ధులను దాదాపు ఖరారు చేసింది. దీంతో.. ఇప్పుడు ఈ ఎన్నికల పైన కేసీఆర్ అనూహ్య నిర్ణయంతో సిద్దమయ్యారు.
తెలంగాణ నుంచి రాజ్యసభకు రెండు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ నుంచి అభిషేక్ సింఘ్వీ, బీఆర్ఎస్ నేత సురేశ్ రెడ్డి రిటైర్మెంట్ వేళ ఈ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అసెంబ్లీలో సంఖ్యా బలం ఆధారంగా కాంగ్రెస్ రెండు స్థానాలు తమ ఖాతాలో వేసుకునేందుకు సిద్దమైంది. ఇందు కోసం సింఘ్వీకి తిరిగి రెన్యువల్ చేయాలని.. రెండో స్థానం నుంచి ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీ చేసిన న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డికి కాంగ్రెస్ ఆలోచనగా ఉంది. ఇదే సమయంలో మాజీ సీఎం కేసీఆర్ తమ అభ్యర్ధిని రాజ్యసభ బరిలో నిలిపే అంశం పైన కసరత్తు అవకాశం సమాచారం. అసెంబ్లీలో బీఆర్ఎస్ కు 37 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. కాగా, పది మంది కాంగ్రెస్ కు దగ్గరయ్యారు. వారిలో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్కు దూరంగా ఉన్నారు. తాజాగా అసెంబ్లీలో ఉన్న లెక్కల ప్రకారం సభలో 119 మంది ఓటు హక్కు వినియోగించుకుంటే రానున్న రాజ్యసభ ఎన్నికల్లో కోటా 40.66 అవుతుంది. అంటే ఒక్కో సీటు గెలుచుకునేందుకు 41 ఓట్లు అవసరం పడుతుంది. రెండు స్థానాలకు 82 మంది బలం కావాల్సి ఉంటుంది.

కొత్త వ్యూహం పై కేసీఆర్ ఫోకస్
కేసీఆర్ పోటీ నిర్ణయం భారీ వెనుక వ్యూహం ఉంది. రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ విప్ వర్తిస్తుంది. ఇదే సమయంలో ఎమ్మెల్యేలు తాము ఏ అభ్యర్థికి ఓటు వేసేది పార్టీ ఏజెంట్కు తప్పకుండా చూపాల్సి ఉంటుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎటు ఓటు వేసేది తేలిపోయే అవకాశం ఉందని అంటున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో గెలుపు ఓటములు ఎలా ఉన్నా, ఫిరాయింపు ఎమ్మెల్యేల వైఖరిని ఎండగట్టే అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కేసీఆర్ కోరారు. ఇదే సమయంలో తాజా లెక్కలను విశ్లేషిస్తున్నారు. రాజకీయ సమీకరణాలను తీసుకొని బీజేపీ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్కు దూరంగా ఉంటే, కోటా 38 అవుతుంది. రెండు స్థానాలకు 76 మంది బలం అవసరం అవుతుంది. కాంగ్రెస్కు ఉన్న 66 మందితో పాటు ఏడుగురు ఎంఐఎం, ఒక సీపీఐ సభ్యునితో కలిపి 74 మంది అవుతారు. రెండు సందర్భాల్లో రెండు సీట్లకు సరిపడా కోటా రాదు. కోటా రాకపోతే ద్వితీయ ప్రాధాన్య ఓట్లు, ఆ తర్వాత తొలగింపు ప్రక్రియ ప్రారంభించడంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల ఓట్లు మరింత కీలకం అవుతాయి. దీంతో.. వస్తే రాజ్యసభ సీటు.. లేకుంటే, ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఫిక్స్ చేయాలనేది కేసీఆర్ వ్యూహంగా ఉంది. దీంతో.. ఇప్పుడు కేసీఆర్ తుది నిర్ణయం చివరకు ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది.

