అంతర్జాతీయ
-బొమ్మ శివకుమార్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్ పై దాడిని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా సౌదీ అరేబియా, గల్ఫ్ దేశాలకు తమ పూర్తి సంఘీభావాన్ని ప్రకటించారు. మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉద్రిక్తతలు పెరుగుతుండగా.. సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాలకు పాకిస్తాన్ పూర్తి మద్దతును ఇచ్చింది. ఇస్లామాబాద్, రియాద్ల మధ్య ఉన్న కీలక ద్వైపాక్షిక భద్రతా ఒప్పందమే ఈ వైఖరికి కారణం. దీని ప్రకారం, ఒక దేశంపై దాడిని రెండు దేశాలపై జరిగినట్లు భావిస్తున్నారు.
ప్రధాని షెహబాజ్ షరీఫ్ సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్తో మాట్లాడి, ప్రస్తుత పరిస్థితులపై పాకిస్థాన్ వైఖరిని స్పష్టం చేశారు. తన ఎక్స్లో ఆయన ఇలా పోస్ట్ చేస్తూ, “నా ప్రియ సోదరుడు మహ్మద్ బిన్ సల్మాన్తో మాట్లాడాను. ఇస్రాయెల్.. ఇరాన్పై దాడి, గల్ఫ్ ప్రాంతంలో దాడుల కారణంగా పాకిస్థాన్ తీవ్ర ఉద్రిక్తతలను ఎదుర్కొంటోంది” అని పేర్కొన్నారు.
“ఈ కష్ట సమయంలో సౌదీ అరేబియా రాజ్యం, సోదర గల్ఫ్ దేశాలతో పాకిస్తాన్ పూర్తి సంఘీభావం చెబుతోంది” అని షరీఫ్ చెప్పారు. శాంతి స్థాపనలో నిర్మాణాత్మక పాత్ర పోషించడానికి తమ దేశం సిద్ధంగా ఉందని, రంజాన్ మాసం ఈ ప్రశాంతత, స్థిరత్వాన్ని తెస్తుందని ఆశించారు.
సౌదీ ప్రభుత్వ వార్తా సంస్థ ప్రకారం.. తాజాగా ఇరాన్.. సౌదీ రాజధాని రియాద్, తూర్పు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది. ఈ చర్యను రియాద్ “నిస్సిగ్గు, పిరికిపంద” చర్యగా అభివర్ణించగా, తమ వైమానిక రక్షణ వ్యవస్థలను విజయవంతంగా తిప్పికొట్టాయని సౌదీ ప్రకటించారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు.. ఇరాన్పై దాడులు ప్రారంభించడంతో మధ్యప్రాచ్యంలో పూర్తి స్థాయి సంఘర్షణ చెలరేగింది. దీనికి ప్రతిగా, టెహ్రాన్, మిత్రులు హిజ్బుల్లా, హౌతీలు టెల్ అవివ్, కువైట్, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్లోని అమెరికన్ స్థావరాలపై క్షిపణులు ప్రయోగించారు. ఈ దాడుల వల్ల దుబాయ్, అబుదాబిలో పేలుళ్లు సంభవించి, క్షిపణుల అడ్డగింత తర్వాత పడిన శిథిలాల వల్ల ఒక ఆసియా జాతీయుడు మరణించాడు.

షరీఫ్ మద్దతు.. గత సంవత్సరంలో రియాద్లో పాకిస్తాన్, సౌదీ అరేబియా మధ్య కుదిరిన ‘వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం’ తర్వాత వచ్చింది. ఈ ఒప్పందం కింద, ఏ దేశంపై దాడి జరిగినా అది రెండు దేశాలపై జరిగినట్లు పరిగణించబడుతుంది. అవసరమైతే, సౌదీ అరేబియా రక్షణలో పాకిస్తాన్ అణు ఆయుధాగారాన్ని తీసుకోవడానికి ఈ ఒప్పందం చట్టబద్ధంగా ఉంటుంది. ఈ సంయుక్త రక్షణ వైఖరిని బలోపేతం చేసి, బాహ్య బెదిరింపులకు వ్యతిరేకంగా పటిష్ట నిరోధాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.

