ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-చంద్రశేఖర్ రావు
రేపు.. మహా శివరాత్రి. ఈ పర్వదినం కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ కూడా ముస్తాబు అయ్యాయి. శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీకాళహస్తీశ్వరాలయం, ద్రాక్షారామం, వేములవాడ, కాళేశ్వరం.. వంటి ప్రఖ్యాత దేవాలయాలు శివరాత్రి శోభను సంతరించుకున్నాయి. వేలాదిమంది భక్తులు శివపార్వతులను దర్శించుకోనున్నారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు.
తిరుపతిలోని శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మహా శివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఇప్పటికే ఇక్కడ శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో కొనసాగుతున్నాయి. ఈ నెల 8వ తేదీన ఇవి ఆరంభం అయ్యాయి. ఇందులో భాగంగా ఆదివారం మహాశివరాత్రి పర్వదినాన్ని ఘణంగా నిర్వహించనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా క్యూలైన్లు, చలువపందిళ్లు, పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేశారు.

మహాశివరాత్రి సందర్భంగా వేకువజామున 2.30 గంటల నుండి 4.30 గంటల వరకు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు రథోత్సవం (భోగితేరు), ఉదయం 11 నుంచి 12 గంటల వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు విశేషమైన నంది వాహనసేవ జరుగుతోంది. తెల్లవారు జామున 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 4.30 నుండి రాత్రి 12 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.
అర్ధరాత్రి 12 నుండి సోమవారం తెల్లవారు జామున 4 గంటల వరకు లింగోద్భవకాల అభిషేకం నిర్వహించారు. అదే రోజు శివపార్వతుల కల్యాణమహోత్సవం అంగరంగ వైభవంగా జరుగనుంది. సాయంత్రం 6 నుండి 7:30 గంటల వరకు ఆర్జితసేవగా ఈ కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. గృహస్తులు (ఇద్దరు) అప్పటికప్పుడు రూ. 500 చెల్లించి టికెట్ కొనుగోలు చేసి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. వారికి లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు.

