భూసార పరీక్షలు తప్పనిసరి – రైతులు తప్పక వినియోగించుకోవాలి
మండల వ్యవసాయ అధికారి ఆర్. అక్బర్ బాషా
వెల్దుర్తి, ఫిబ్రవరి 04, (సీమకిరణం న్యూస్ ) :

కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం అయిన మండల పరిధిలోని వెల్దుర్తి మరియు మదార్పురం గ్రామాలలో ప్రకృతి వ్యవసాయం సిబ్బంది (APCNF) ఆధ్వర్యంలో భూసార పరీక్షల కోసం మట్టి నమూనాల సేకరణ కార్యక్రమం కొనసాగుతోందని వెల్దుర్తి మండల వ్యవసాయ అధికారి ఆర్. అక్బర్ బాషా తెలిపారు. మండల వ్యాప్తంగా మొత్తం 1097 మట్టి నమూనాలు సేకరించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.సేంద్రీయ మరియు ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి చూపుతున్న రైతుల నుంచి ప్రతి గ్రామంలో ప్రకృతి వ్యవసాయం సిబ్బంది సహకారంతో మట్టి నమూనాలను సేకరిస్తున్నట్లు ఆర్. అక్బర్ బాషా వివరించారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం సిబ్బందికి మట్టి నమూనాల సేకరణ పద్ధతులపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం కూడా నిర్వహించినట్లు తెలిపారు.భూసార పరీక్షల ద్వారా భూమిలో ఉన్న లోపాలను గుర్తించి, అవసరమైన పోషకాలను సమతులంగా అందించడం ద్వారా మంచి దిగుబడులు సాధించవచ్చని మండల వ్యవసాయ అధికారి ఆర్. అక్బర్ బాషా రైతులకు సూచించారు.విచక్షణారహితంగా రసాయన ఎరువులు వినియోగించకుండా, సేంద్రియ ఎరువుల వినియోగం వైపు రైతులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.నెల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించే సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్టె ఎరువుల వినియోగాన్ని రైతులు మరింతగా పెంచుకోవాలని ఆర్. అక్బర్ బాషా కోరారు. సమతుల ఎరువుల యాజమాన్యం భూసార పరీక్షల ద్వారానే సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.భూసార పరీక్షలు చేయించుకోవాలనుకునే రైతులు తమ గ్రామంలోని రైతు సేవా కేంద్రం సిబ్బందిని లేదా ప్రకృతి వ్యవసాయం సిబ్బందిని తప్పక సంప్రదించాలని వెల్దుర్తి మండల వ్యవసాయ అధికారి ఆర్. అక్బర్ బాషా విజ్ఞప్తి చేశారు.

