తెలంగాణ
oi-డాక్టర్ వీణా శ్రీనివాస్
వరంగల్ జిల్లా రైల్వే రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ ప్రాంతం, ఇప్పుడు భారీ రైల్వే ప్రాజెక్టులతో దేశంలో కీలక రైల్వే హబ్గా మారే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. కాజీపేట మరియు మహబూబాబాద్ ప్రాంతాల నిర్మాణంలో ఉన్న రెండు భారీ ప్రాజెక్టులు వరంగల్ అభివృద్ధికి కొత్త దిశను చూపుతున్నాయి.
కాజీపేటలో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్
దేశంలోనే తొలిసారిగా మల్టీపుల్ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను కాజీపేటలో ఏర్పాటు చేసింది రైల్వే శాఖ. సుమారు రూ. 720 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. ఈ యూనిట్లో మెట్రో కోచ్లు, ఈఎంయూలు, అలాగే వ్యాగన్ల తయారీ చేయనున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనుల్లో దాదాపు 95 శాతం పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు. ఈ యూనిట్లో రైల్వే కోచ్ల తయారీలో జర్మన్ సాంకేతికతతో కూడిన LHB టెక్నాలజీని వినియోగించనున్నారు. అలాగే కోచ్ల పెయింటింగ్ ప్రక్రియలో అత్యాధునిక రోబోటిక్ టెక్నాలజీ ఉపయోగించబడుతుంది.

మహబూబాబాద్లో మెగా మెయింటెనెన్స్ డిపో
మహబూబాబాద్ జిల్లాలోనూ రైల్వే ప్రాజెక్ట్ ను ఏర్పాటు చేసింది. మహబూబాబాద్ ఏర్పాటు అనంతారం సమీపంలోని భారీ రైల్వే మెగాయింటెనెన్స్ డిపోను ఏర్పాటు చేశారు. సుమారు రూ. 908 కోట్ల వ్యయంతో 409 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటు అవుతోంది. ఈ డిపోలో గూడ్స్ రైళ్లతో పాటు ఆధునిక రైళ్లకు చెందిన కోచ్ల మరమ్మత్తులు, ఓవరాలింగ్ పనులు నిర్వహిస్తున్నారు.
యువతకు ఉపాధి .. ప్రధాని చేతులమీదుగా ప్రారంభం
ముఖ్యంగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ ల కోచ్ల నిర్వహణ కూడా ఇక్కడే జరిగే అవకాశం ఉంది. ఈ రెండు భారీ రైల్వే ప్రాజెక్టుల వల్ల దాదాపు 25,000 మందికి పైగా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. ఈ ప్రాజెక్టులు పూర్తయ్యాక వరంగల్ దేశంలో ప్రముఖ రైల్వే కేంద్రంగా ఎదగనుంది. ఆర్థికంగా కూడా జిల్లాకు పెద్ద ఊతం లభించనుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టులను భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం.

