భారతదేశం
-సాయి చైతన్య
యుద్దం ప్రభావం పెట్రో ధరల పైన భారీగా పడుతోంది. ఇప్పటికే వంట గ్యాస్ కొరత కారణంగా హోటల్ రంగం కుదేలైంది. ఇంటికి వినియోగించే వినియోగదారుల్లోనూ ఆందోళన పెరుగుతోంది. ఇప్పటికే వంట గ్యాస్ ధరలను భారీగా పెంచారు. తాజాగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తప్పటం లేదు. పవర్ పెట్రో పైన రూ 2 వరకు పెంచిన ఆయిల్ కంపెనీలు.. ఇప్పుడు ఇండస్ట్రియల్ డీజిల్ పైన ఏకంగా రూ 22 వరకు పెంచేసారు. దీని ప్రభావం నిత్యావసరాల పైన పడటం ఖాయంగా మారింది. యుద్ధం మరింత కాలం కొనసాగితే.. కొత్త సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
పశ్చిమాసియా యుద్ద ప్రభావం గ్యాస్, పెట్రో ఉత్పత్తులపై పడుతోంది. తాజాగా పవర్ పెట్రోల్ ధరను లీటరుకు రూ.2 పెంచినట్లు HPCL ప్రకటించింది. సవరించిన ధరలు శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయి. అయితే సాధారణ పెట్రోల్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు. దేశంలో ఇంధన ధరల పెరుగుదలపై ఇప్పటికే ప్రజల్లో ఆందోళన కొనసాగుతున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరల మార్పులను బట్టి మరిన్ని ధరల సవరణలు జరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) పారిశ్రామిక డీజిల్ ధరను లీటరుకు రూ.87.67 నుంచి రూ.109.59కి పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం పారిశ్రామిక రంగం, లాజిస్టిక్స్, రవాణా ఖర్చులపై ప్రభావం చూపుతుందని.

నిత్యావసర వస్తువుల ధరల పై ప్రభావం
ఈ నిర్ణయంతో అన్నింటి పైన రవాణా ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వంట గ్యాస్ ధరలను భారీగా పెంచారు. ఇప్పటికీ కమర్షియల్ గ్యాస్ అందుబాటులో లేక పలు ప్రాంతాల్లో హోటళ్లను మూసి వేసారు. కాగా.. పారిశ్రామిక డీజిల్ను సాధారణ పెట్రోల్ పంపుల్లో అమ్మరు. దీనిని ఫ్యాక్టరీలు, పెద్ద జనరేటర్లు, మైనింగ్ కంపెనీలు, నిర్మాణ స్థలాలు, పవర్ ప్లాంట్లు నేరుగా కొనుగోలు చేస్తున్నారు. ముడి చమురు ధరలలో ఈ పెరుగుదల సామాన్య ప్రజల జేబులపై నేరుగా ప్రభావం చూపుతుంది. సామాన్య ప్రజలు వినియోగించే పెట్రోలు- డీజిల్ ధరల పైన ఇప్పటి వరకు పెంపు నిర్ణయం జరగలేదు. యుద్దం మరింత కాలం కొనసాగితే.. వీటి ధరలు పెరగక తప్పని పరిస్థితి ఏర్పడుతుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.

