seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 03 August 2026, 1:18 pm Digital Edition : SEEMA KIRANAM

బెజవాడ దుర్గమ్మ గుడిలో ఇన్‌స్టా రీల్స్

💥బెజవాడ దుర్గమ్మ గుడిలో ఇన్‌స్టా రీల్స్..

 

@- రాజగోపురం వద్ద యువతి డ్యాన్స్!

 

విజయవాడలోని ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయంలో ఓ యువతి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయడం ఇప్పుడు వివాదాస్పదమైంది. దుర్గామాత ఆలయంలోని మహా మండపం ఏడో అంతస్థు రాజగోపురం వద్ద ఓ యువతి డ్యాన్స్ చేస్తూ ఇన్‌స్టా రీల్స్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఆలయ అధికారులు సీరియస్ అయ్యారు. దీనిపై విజయవాడ వన్ టౌన్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. రాజగోపురానికి ఎదురుగా నిలబడి యువతి నాట్యం చేస్తూ వీడియోలు తీసింది. అంతసేపు ఆ యువతి రాజగోపురం ఎదురుగా నిలబడి నాట్యం చేస్తుంటే ఆలయ అధికారులు, సిబ్బంది ఏమైపోయారు అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. భద్రత విషయంలో బెజవాడ దుర్గమ్మ ఆలయం ఏ స్థితిలో ఉందో ఇక్కడే తెలుస్తుందని సోషల్ మీడియాలో పలువురు కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కూడా బెజవాడ దుర్గమ్మ ఆలయం లోపలికి వెళ్లి అమ్మవారిని ఫొటోలు తీసి నెట్టింట పోస్టు చేసిన సంఘటనలు ఉన్నారు. ఆలయ ప్రాంగణంలోకి సెల్‌‌ఫోన్లకు అనుమతి లేదు.. భక్తుల దర్శనానికి వచ్చే మార్గంలోనే కొండ దిగువన కనకదుర్గా నగర్, ఘాట్‌రోడ్డు వైపు వచ్చే వారికి ఓం టర్నింగ్ వద్ద సెల్‌ఫోన్ కౌంటర్లున్నాయి. ఎవరైనా ఆలయంలోకి వెళ్లేటప్పుడు అక్కడే మొబైల్ ఫోన్లు ఇచ్చేసి దర్శనానికి వెళ్లాలి. వందలాది మంది మొబైల్ ఫోన్లతోనే ఆలయంలోకి వచ్చేస్తున్నారు. ఆలయంలో సెల్‌ఫోన్లు తీసుకురాకూడదు, ఫొటోలు తీసుకోకూడదనే బోర్డులు కూడా దర్శనమిస్తాయి. అయితే, ఆచరణలో మాత్రం అది ఎక్కడా అమలు జరగడం లేదని పలువురు అంటున్నారు. యువతి నాట్యం విషయంలో దేవస్థానం ఈఓ వి.కె.శీనా నాయక్ ఆదేశాల మేరకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ అధికారి వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జూలై 30వ తేదీ మధ్యాహ్నం 1:45 గంటల నుంచి 1:47 గంటల మధ్య వీడియో తీసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సుమారు రెండు నిమిషాల పాటు ఆమె వీడియో రికార్డు చేసి ఇన్‌స్టాలో పోస్టు చేసినట్లు తెలిపారు. ఆలయ పవిత్రతను దెబ్బతీసినట్లు అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు.