ప్రజల సమస్యలపై తక్షణ స్పందన… అభివృద్ధే లక్ష్యంగా కలెక్టర్ డా. ఏ. సిరి పరిపాలన
క్షేత్రస్థాయిలో పర్యటనలు… ఇంటింటికీ వెళ్లి పింఛన్ల పంపిణీ… ప్రజలకు చేరువైన పరిపాలన
ప్రజా సంక్షేమం, పారదర్శక పాలనతో కర్నూలు జిల్లా ప్రజల ప్రశంసలు
కర్నూలు ప్రతినిధి, ఆగస్టు 02, (సీమకిరణం న్యూస్) :


కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ జిల్లాలో సమర్థవంతమైన పరిపాలన అందిస్తున్నారనే అభిప్రాయం పలువురిలో వ్యక్తమవుతోంది. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను స్వయంగా విని, సంబంధిత శాఖల అధికారులతో తక్షణ చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేస్తున్నారు. జిల్లాలోని గ్రామాలు, పట్టణాల్లో తరచూ పర్యటిస్తూ సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనుల పురోగతి, తాగునీరు, పారిశుధ్యం, విద్య, వైద్యం, రెవెన్యూ సేవలపై నేరుగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి, సమస్యలు ఆలస్యం కాకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశిస్తున్నారు. ఇటీవల నగరంలోని పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ డా. ఏ. సిరి, వృద్ధులు మరియు దివ్యాంగ లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్లు అందజేయడం విశేషంగా నిలిచింది. లబ్ధిదారులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి, సంక్షేమం గురించి ఆరా తీస్తూ, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రతి అర్హుడికి చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత, అధికారుల్లో జవాబుదారీతనం, ప్రజలకు వేగవంతమైన సేవలందింపుపై ప్రత్యేక దృష్టిసారిస్తూ జిల్లా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజలకు చేరువగా ఉండే పరిపాలన, క్షేత్రస్థాయి పర్యటనలు, మానవీయ దృక్పథంతో వ్యవహరించే తీరు జిల్లా ప్రజల ప్రశంసలను అందుకుంటోంది. జిల్లా సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కలెక్టర్ డా. ఏ. సిరి చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల్లో విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.