పాణ్యం పోలీసుల అద్భుత చొరవతో ఎన్ హెచ్ – 40పై ప్రమాదాలకు చెక్
“ప్రజల ప్రాణ రక్షణే మా లక్ష్యం – ప్రమాద రహిత ప్రయాణమే మా ధ్యేయం”
పాణ్యం సీఐ కిరణ్ కుమార్ రెడ్డి, ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి
నంద్యాల క్రైమ్ /పాణ్యం, జూన్ 10, (సీమకిరణం న్యూస్):


రోడ్డు ప్రమాదాల నివారణకు పాణ్యం పోలీసులు చేపట్టిన వినూత్న చర్య ఫలితంగా ఎన్ హెచ్-40 జాతీయ రహదారిపై సుగాలిమెట్ట–పిన్నపురం గ్రామాల మధ్య సురక్షిత ప్రయాణానికి మార్గం సుగమమైంది. కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ సూచనలు, నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, సబ్ డివిజనల్ అధికారి కుమారి ఎం. జావళి ప్రత్యక్ష పర్యవేక్షణలో పాణ్యం పోలీసులు ప్రమాదకర బ్లాక్స్పాట్ను గుర్తించి శాశ్వత పరిష్కారం చూపించారు. ఇప్పటివరకు సుగాలిమెట్ట నుంచి పిన్నపురం గ్రామానికి వెళ్లే ప్రజలు ఎన్ హెచ్-40పై ప్రమాదకరంగా రోడ్డు దాటాల్సి వచ్చేది. దీంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుని ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారింది. ఈ పరిస్థితిని గమనించిన పాణ్యం సీఐ కిరణ్ కుమార్ రెడ్డి, ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి చొరవతో నేషనల్ హైవేస్, రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారులు మరియు స్థానిక ప్రజల సహకారంతో బ్రిడ్జి కిందుగా సురక్షిత సర్వీస్ రోడ్డును నిర్మించారు. ఈ నూతన అండర్పాస్ సర్వీస్ రోడ్డును పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, ఏఎస్పీ కుమారి ఎం. జావళి, అదనపు ఎస్పీ యుగంధర్ బాబు తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ సునీల్ షొరాణ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి మరియు డీజీపీ ఆదేశాల మేరకు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గతంలో ప్రజలు యూటర్న్ కోసం అదనంగా 5.5 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేదని, దూరాన్ని తగ్గించేందుకు కొందరు రాంగ్ రూట్లో ప్రయాణించడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరిగేవని చెప్పారు. కొత్త అండర్పాస్తో ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందన్నారు.
ప్రజలకు కలిగే ప్రయోజనాలు ;
✅ రాంగ్ సైడ్ డ్రైవింగ్కు అడ్డుకట్ట పడటంతో ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయి.
✅ ప్రయాణ దూరం సుమారు 5.5 కిలోమీటర్లు తగ్గి సమయం, ఇంధనం ఆదా అవుతుంది.
✅ రైతులు, పశువులు సురక్షితంగా రహదారి దాటేందుకు అనుకూలం.
✅ రాత్రివేళ భద్రత కోసం సోలార్ లైట్లు ఏర్పాటు చేశారు.
✅ నిరంతరం పనిచేసే సీసీటీవీ కెమెరాలతో నేరాల నియంత్రణకు దోహదం చేస్తుంది.
పోలీసుల విజ్ఞప్తి :
వాహనదారులు ఎట్టి పరిస్థితుల్లోనూ రాంగ్ సైడ్లో ప్రయాణించవద్దని, కొత్తగా అందుబాటులోకి వచ్చిన అండర్పాస్ను వినియోగించుకుని సురక్షితంగా ప్రయాణించాలని పోలీసులు సూచించారు. ఒక్క ప్రమాదాన్ని నివారించినా ఒక కుటుంబాన్ని కాపాడినట్లేనని అధికారులు పేర్కొన్నారు. ప్రజల ప్రాణ రక్షణే లక్ష్యంగా యుద్ధప్రాతిపదికన ఈ సర్వీస్ రోడ్డును ఏర్పాటు చేసిన పాణ్యం సీఐ కిరణ్ కుమార్ రెడ్డి, ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి మరియు సిబ్బందిని డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ సునీల్ షొరాణ్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ చర్యపై స్థానిక ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తూ పోలీసు శాఖకు కృతజ్ఞతలు తెలియజేశారు. “ప్రజల ప్రాణ రక్షణే మా లక్ష్యం – ప్రమాద రహిత ప్రయాణమే మా ధ్యేయం” అని పాణ్యం సీఐ కిరణ్ కుమార్ రెడ్డి, ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి పేర్కొన్నారు.