పంటల బీమా నమోదు చేసుకోండి
రైతులకు మండల వ్యవసాయ అధికారి అక్బర్ బాషా సూచన
వెల్దుర్తి, జూలై 11,(సీమకిరణం న్యూస్):
వర్షాభావ పరిస్థితులు అనుకూలించకపోయినా, ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు నష్టపోయినా పంటల బీమా రైతులకు అండగా నిలుస్తుందని మండల వ్యవసాయ అధికారి అక్బర్ బాషా తెలిపారు. రైతులు నిర్ణీత ప్రీమియం చెల్లించి పంటల బీమా పథకంలో నమోదు చేసుకోవడం ద్వారా అతివృష్టి, అనావృష్టి వంటి పరిస్థితుల్లో పంట నష్టానికి పరిహారం పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద:
వేరుశనగ, ప్రత్తి, టమాట పంటలకు రైతులు జూలై 15వ తేదీలోపు నమోదు చేసుకోవాలని సూచించారు.
ప్రీమియం వివరాలు (ఎకరానికి):
ప్రత్తి పంటకు రూ. 2,000
వేరుశనగ పంటకు రూ. 560
టమాట పంటకు రూ. 1,500
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద:
కందులు, ఆముదం, కొర్ర, సజ్జలు, ఉల్లి పంటలకు రైతులు డిసెంబర్ 15వ తేదీలోపు నమోదు చేసుకోవాలని తెలిపారు. పంటల బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే రైతులు గ్రామంలోని రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించి పంట సాగు ధ్రువీకరణ పత్రం పొందాలని సూచించారు. అనంతరం మీ సేవ, కామన్ సర్వీస్ సెంటర్ (CSC), పోస్టాఫీస్ లేదా సమీప బ్యాంకులను సంప్రదించి పంటల బీమా పథకంలో నమోదు చేసుకోవచ్చని అక్బర్ బాషా తెలిపారు.