భారతదేశం
ఓయ్-గరికపాటి రాజేష్
తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం కనిపిస్తున్న పోకడలు చూస్తుంటే, ప్రజాస్వామ్య దేవాలయం కాస్తా వ్యక్తిగత దూషణల అడ్డాగా మారిందా అన్న అనుమానం కలగక మానదు. ఒకప్పుడు వివేకం, వాగ్ధాటి, ప్రజా సంక్షేమమే అజెండాగా సాగిన రాజకీయాలు, నేడు అశ్లీల ప్రేలాపనలు, మహిళా సినీ తారలపై వ్యాఖ్యలకు చిరునామాగా మారుతున్నాయి. తమిళనాడులో సినిమా, రాజకీయం అనేవి ఒకే నాణేనికి ఉన్న రెండు పార్శ్వాలు. ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి వంటి దిగ్గజాలు వెండితెరపై ఎంతటి అభిమానాన్ని సంపాదించుకున్నారో, రాజకీయ తెరపై అంతకంటే గొప్ప పరిపాలనను అందించారు. కానీ, నేడు అదే వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నామని చెప్పుకునే నేతలు, రాజకీయ లబ్ధి కోసం సినీ తారల వ్యక్తిగత జీవితాలను రోడ్డు మీదకు లాగడం శోచనీయం.ప్రస్తుతం తమిళనాట దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ రాజకీయ ప్రత్యర్థులను విధానపరంగా ఎదుర్కోవలసింది పోయి, వారిని వ్యక్తిగతంగా దెబ్బతీసేందుకు మహిళా నటిమణులను పావులుగా వాడుకోవడం అత్యంత హేయమైన చర్య.
వ్యక్తిత్వ హననం
ఇటీవల బీజేపీ నేత నయినర్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపాయి. విజయ్ రాజకీయ ఎదుగుదలను విమర్శించేలా ఉంది, ప్రముఖ నటి త్రిష పేరును వివాదంలోకి లాగడం, ఆమెతో అక్రమ సంబంధం అంటగట్టడం రాజకీయ దిగజారుడుతనానికి పరాకాష్ట. విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన క్షమాపణలు చెప్పారు, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది.

ఈ వివాదం సద్దుమణగక ముందే, అన్నాడీఎంకే మాజీ మంత్రి సి.వి. షణ్ముగం ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రవేశపెట్టిన మహిళా ఉరిమై తొక్కై విమర్శిస్తూ.. నాకు నయనతార కావాలి, ఆ పథకం ద్వారా నా కల నెరవేరుతారా? అంటూ చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేశాయి. ఒకప్పుడు జయలలిత వంటి ధీరవనిత నాయకత్వంలో నడిచిన పార్టీలో ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు వినిపించడం ఆ పార్టీకే తీరని కళంకం.
రాజకీయ అస్త్రం కాదు
రాజకీయం అంటే ప్రజాసేవ. కానీ నేడు అది పరనింద, పరుష పదజాలం, అశ్లీల విమర్శలమయంగా మారుతోంది. ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు వారి కుటుంబ సభ్యులను లేదా సంబంధం లేని మహిళలను లక్ష్యంగా చేసుకుని పిరికిపంద చర్య. సినీ రంగంలో ఉన్న మహిళలు సులభమైన లక్ష్యాలుగా మారడం రాజకీయ నాయకుల అహంకారానికి నిదర్శనం. నిరుద్యోగం, ధరల పెరుగుదల, సామాజిక అభివృద్ధిపై చర్చించాల్సిన వేదికలు ఇప్పుడు ఎవరితో ఎవరికి సంబంధం ఉందా? అనే స్థాయికి దిగజారిపోయాయి.
ఓటరు తీర్పు ఎలా ఉండబోతోంది?
తమిళనాడులో మహిళా ఓటర్ల ప్రభావం అత్యధికం. జయలలిత హయాంలో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేయడంతో వారు ఆమెకు అండగా నిలిచారు. కానీ నేడు మహిళా నటిమణులను అవమానిస్తూ, వారి ఆత్మగౌరవాన్ని పెడుతున్న నేతలకు రాబోయే ఎన్నికల్లో మహిళా లోకం బుద్ధి చెబుతుందా? అన్నది ఇప్పుడు అసలైన ప్రశ్న.

