తెలంగాణ
ఓయ్-బొమ్మ శివకుమార్
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ మేరకు తెలంగాణ నేల తల్లికి హృదయపూర్వక పాదాభివందనాలు అని పవన్ కల్యాణ్ ఎమోషనల్ ట్వీట్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.
“తెలంగాణలో ఉద్భవించిన పార్టీ జనసేన. ఈరోజు విజయలక్ష్మి రూపంలో తొలి అడుగుపడింది. పార్టీ తొలినాళ్ళు గుర్తు చేసుకుంటే దారంతా గతుకులు.. భవిష్యత్తు ఏమిటనే ప్రశ్న. చిన్నపాటి ఆసరా కూడా లేదు. మిణుకుమిణుకుమనే ఆశ.
తెలంగాణలోని వీర మహిళలు, జనసైనికులు పురపాలక ఎన్నికలకు సన్నద్ధమయ్యారు. 2998 స్థానాలున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జనసేన 332 చోట్ల పోటీ చేసింది. ఒక కౌన్సిలర్ స్థానం, ఒక కార్పొరేటర్ స్థానం జనసేనకు దక్కాయి.
మహా వృక్షమైనా చిన్న విత్తు నుంచే నేల పొరలను చీల్చుకొని మొలక వేస్తుంది. విశ్వ విజేత కూడా తల్లి గర్భంలో అణువంటే ఉంటాడు. కోటి రతనాల వీణ తెలంగాణలో జనసేన విజయ ప్రయాణం లేలేత అడుగులతో మొదలైంది. నేరేడుచర్ల మున్సిపాలిటీలో ఆరూరి విజయలక్ష్మి, మంచిర్యాల కార్పొరేషన్లో అగ్గు సాగర్ జనసేన అభ్యర్ధులుగా సాధించిన విజయాలు భవిష్యత్తు ప్రస్థానానికి బలమైన స్ఫూర్తిని అందజేస్తున్నాయి.

విజయలక్ష్మి, సాగర్ లకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. జనసేన తెలంగాణ వీర మహిళలు, జనసేన సైనికులు, నాయకులకు అభినందనలు. పార్టీ ఉద్భవించిన నేలపై దక్కిన తొలి విజయం ఇది. పోరాట పటిమను.. సంస్కృతి సంప్రదాయాల శక్తిని.. సాహితీ సౌరభాన్ని.. అణువణువునా నింపుకున్న తెలంగాణ నేల తల్లికి హృదయపూర్వక పాదాభివందనాలు” అని పవన్ కల్యాణ్ ట్వీట్లో పేర్కొన్నారు.

