పెట్రోల్, డీజల్ కొరత లేదు
అవసరానికి మించి కొనుగోలు చేయొద్దు
ఒక్కో పెట్రోల్ బంక్ కు కస్టోడియన్ ఆఫీసర్ ను నియమించాం
కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 1800 425 4299 ను అన్ని పెట్రోల్ బంక్ ల్లో ప్రదర్శించండి
కర్నూలు ప్రతినిధి, ఏప్రిల్ 26, (సీమకిరణం న్యూస్) :
పెట్రోల్, డీజల్ కొరత లేదు..ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దు..అవసరానికి మించి కొనుగోలు చేయొద్దు అని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి విజ్ఞప్తి చేశారు. ఆదివారం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ తో కలిసి ఆర్డీవోలు, తహసీల్దార్లు, సిఎస్ డిటి లు తదితరులతో కలిసి కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్టాక్ లేదనే వార్తలతో వాహనదారులు బంకుల వద్ద క్యూ కడుతుండటంతో, వచ్చిన స్టాక్ వెంటనే అయిపోతోందని, ఆర్డీవోలు, తహసీల్దార్ లు పెట్రోల్ బంక్ లు తనిఖీ చేసి, పరిస్థితిని నియంత్రణ లోకి తీసుకురావాలన్నారు. క్యాన్ లు, డబ్బాల్లో నింపుకుని వెళ్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు.ఒక్కో పెట్రోల్ బంక్ కు కస్టోడియన్ ఆఫీసర్ ను నియమించామని, ఒక్క పెట్రోల్ బంక్ కూడా డ్రై ఔట్ కాకుండా చూడాలన్నారు.శాంతి భద్రతలకు భంగం కలగకుండా, పెట్రోల్ బంక్ వద్ద పోలీస్ సిబ్బందిని కూడా నియమించాలని కలెక్టర్ ఎస్పీ ని కోరారు. అలాగే కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని, కంట్రోల్ రూమ్ నెంబర్ 1800 425 4299 కు సమస్యలు ఏవైనా ఉంటే ఫోన్ చేయవచ్చని, కంట్రోల్ రూమ్ లో కూడా పోలీస్ సిబ్బంది ఉండేలా చూడాలన్నారు. ఎక్స్ట్రా పెట్రోల్, డీజల్ సరఫరా చేయాలని ఆయిల్ కంపెనీ లను కోరామని, పెట్రోల్, డీజల్ కొరత లేదు..ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దు..అవసరానికి మించి కొనుగోలు చేయొద్దు అని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే 15 కేసులు బుక్ చేశామని, అక్రమ నిల్వలు లేదా అక్రమ రవాణా చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.