seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 20 July 2026, 12:50 pm Digital Edition : SEEMA KIRANAM

తల్లికి వందనం పథకం నిధుల విడుదల వేళ సైబర్ నేరగాళ్లు వల

తల్లికి వందనం పథకం నిధుల విడుదల వేళ సైబర్ నేరగాళ్లు వల

 

ఆధార్ బ్యాంక్ వివరాలు ఎవరికీ చెప్పొద్దు

 

తల్లికి వందనం పథకం.. పిల్లల చదువుకు ఆర్థిక సమస్యలు అడ్డు కాకూడదనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమం. జూలై 22వ తేదీన తల్లికి వందనం పథకం నిధుల విడుదలకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. సుమారు 67 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా రూ.13 వేలు ఆర్థిక సాయం అందించనున్నారు. అయితే తల్లికి వందనం పథకం నిధుల విడుదల వేళ.. ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకునేందుకు సైబర్ నేరగాళ్లు వల విసురుతున్నారు. పథకం కింద అర్హులైన వారి బ్యాంక్ ఖాతాలలో ప్రభుత్వం సొమ్ము జమ చేస్తుందని ప్రకటన రాగానే.. తల్లిదండ్రులు అందరూ తమ పిల్లలు అర్హుల జాబితాలో ఉన్నారా, లేదా అనే వివరాలను సరిచూసుకుంటున్నారు. ఇదే సైబర్ నేరగాళ్లకు అవకాశంగా మారుతోందని కర్నూలు సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. తల్లికి వందనం నిధుల విడుదల నేపథ్యంలో ఈ పథకం పేరుతో సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులను కర్నూలు ఎస్పీ హెచ్చరించారు. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌ సూచించారు. సోషల్ మీడియా ద్వారా వచ్చే మోసపూరిత లింకులను నమ్మవద్దని అప్రమత్తం చేశారు. ఇలాంటి లింకులు పంపి బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తారని హెచ్చరించారు. అలాగే అపరిచిత వ్యక్తులతో ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్, ఓటీపీ వంటి వివరాలు పంచుకోవద్దని సూచించారు. తల్లికి వందనం పథకంతో పాటుగా ఏదైనా ప్రభుత్వ పథకాల సమాచారం కోసం సమీపంలోని స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు కార్యాలయాలను సంప్రదించాలని కర్నూలు ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు జూలై 22వ తేదీ నుంచి విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాలలో తల్లికి వందనం నిధులను ప్రభుత్వం జమ చేయనుంది. ఇంట్లో స్కూలుకు వెళ్లే పిల్లలు ఎంతమంది ఉంటే.. అందరికీ కూడా ఈ పథకం సాయం అందించనుంది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లికి వందనం పథకం కింద రూ.10,120.78 కోట్లు అకౌంట్లలో జమ చేయనుంది. 67,47,190 మంది విద్యార్థులకు ఈ పథకం కింద సాయం అందించనున్నారు. ఒకటవ తరగతి నుంచి ఇంటర్ వరకూ చదివే విద్యార్థులకు ఈ సాయం అందిస్తారు. ఇక ఈసారి తల్లికి వందనం పథకాన్ని అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు కూడా వర్తింపజేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవేళ ఏవైనా కారణాలతో అర్హులై ఉండి కూడా తల్లికి వందనం పథకం సాయం అందకపోతే జూలై నెలాఖరులోగా క్లియర్ చేయాలని మంత్రి నారా లోకేష్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.