తమిళనాడు సీఎంగా ‘విజయ్’ అనే నేను..
రాజధానిలో దళపతి సరికొత్త శకం..
మిత్రపక్షాల మద్దతుతో కొలువుదీరిన టీవీకే ప్రభుత్వం
నాడు రాజకీయ చదరంగం.. నేడు అధికార పీఠం..
గవర్నర్తో ప్రమాణం చేసిన జోసెఫ్ విజయ్
చెన్నై, మే 10, (సీమకిరణం న్యూస్):
తమిళనాడు రాజకీయ యవనికపై సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. ఆరు దశాబ్దాల పాటు సాగిన ద్రావిడ పార్టీల ఆధిపత్యానికి తెరదించుతూ.. తమిళగ వెట్రి కజగం (టీవీకే) సారథి, సినీ నటుడు విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. ఆదివారం ఉదయం చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో కళ్లు మిరుమిట్లు గొలిపే రీతిలో జరిగిన వేడుకలో.. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ విజయ్తో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఉదయం 10 గంటలకు నిర్ణయించిన ముహూర్తం కంటే ముందే స్టేడియం పరిసరాలు టీవీకే కార్యకర్తలు, అభిమానులతో కిక్కిరిసిపోయాయి. నల్లటి బ్లేజర్ ధరించి వేదికపైకి వచ్చిన విజయ్, అశేష జనవాహిని మధ్య *”విజయ్ అనే నేను..” అంటూ గంభీర స్వరంతో చేసిన ప్రమాణం స్టేడియం మార్మోగేలా చేసింది.* విజయ్తో పాటు ఆయన కేబినెట్లోని తొమ్మిది మంది మంత్రులు కూడా బాధ్యతలు స్వీకరించారు. ఈ చారిత్రక ఘట్టానికి కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. సినీ రంగం నుంచి త్రిష వంటి ప్రముఖులతో పాటు విజయ్ తల్లిదండ్రులు ఎస్.ఏ. చంద్రశేఖర్, శోభ కూడా హాజరై భావోద్వేగానికి లోనయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, మ్యాజిక్ ఫిగర్ (118)కు స్వల్ప దూరంలో నిలిచింది. అయితే కాంగ్రెస్ (5), వీసీకే (2), వామపక్షాలు (4), ఐఎంయూఎల్ (2) వంటి మిత్రపక్షాల మద్దతుతో మొత్తం 120 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకుని విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం, ఈ నెల 13వ తేదీలోగా శాసనసభలో తన బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ ముఖ్యమంత్రికి సూచించారు. తమిళనాడులో 1967 తర్వాత కాంగ్రెస్, డీఎంకే, అన్నాడీఎంకేయేతర ప్రభుత్వం కొలువుదీరడం ఇదే తొలిసారి కావడం విశేషం.