డీఎస్సీ అక్రమాలపై ‘సమరం’.. మూడు రోజుల రిలే దీక్షలు
నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు
పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ
సోమవారం భారీ ర్యాలీ.. పెద్దఎత్తున తరలిరావాలని నిరుద్యోగ యువతకు పిలుపు
పత్తికొండ, ఆగస్టు 08, (సీమకిరణం న్యూస్) :

డీఎస్సీలో జరిగిన అక్రమాలు, మోసాలను ప్రజలకు వివరిస్తూ వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన మూడు రోజుల రిలే నిరాహార దీక్షలు ముగిశాయి. తుగ్గలి, మద్దికెర మండలాల పార్టీ నాయకులతో కలిసి పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ దీక్షా శిబిరాన్ని సందర్శించి, నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపజేశారు. ఈ సందర్భంగా కంగాటి శ్రీదేవమ్మ మాట్లాడుతూ.. డీఎస్సీలో జరిగిన అక్రమాలు, మోసాలను ప్రజలకు వివరించేందుకే గత మూడు రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టినట్లు తెలిపారు. దీక్షలకు సంఘీభావం తెలిపిన సీపీఐ, ఏఐవైఎఫ్, న్యాయవాదులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లామని, నిరుద్యోగ యువతీ యువకులకు న్యాయం జరిగే వరకు వారి తరఫున నిరంతరం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరిన్ని ప్రజా ఉద్యమాలు చేపట్టి నిరుద్యోగ యువతకు వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. సోమవారం నిర్వహించనున్న భారీ ర్యాలీలో నిరుద్యోగ యువతీ యువకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ పిలుపునిచ్చారు.