జిల్లా ప్రజలకు ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు ప్రతినిధి, మార్చి 18, (సీమకిరణం న్యూస్) :
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి జిల్లా ప్రజలకు తెలుగు నూతన సంవత్సరాది ఉగాది మరియు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు నూతన సంవత్సరాది శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా కలెక్టర్ జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియచేశారు.ఈ ఉగాది ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ ఏడాది సమృద్ధిగా వానలు కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులకు మేలు కలగాలని, అన్ని వర్గాల ప్రజలూ ఆనందంగా ఉండాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
రంజాన్ పండుగ శుభాకాంక్షలు :-
పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో నెలరోజుల పాటు కఠోర ఉపవాస దీక్షతో నిష్టగా, అల్లాను ఆరాధిస్తూ ఆధ్యాత్మిక జీవనం గడిపిన ముస్లిం సోదర సోదరీమణులందరికీ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియచేశారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం విశిష్టత అని, దీక్షలు, ఉపవాసాలు, దైవారాధన, దానధర్మాలు, చెడును త్యజించడం, సాటి మానవులకు సేవ వంటి సత్కార్యాల ద్వారా అల్లాహ్ స్మరణలో తరింప చేసిన రంజాన్ పండుగను ముస్లిం సోదర సోదరీమణులందరూ సంతోషంగా జరుపుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. అల్లాహ్ దీవెనలతో జిల్లా ప్రజలకు సకల శుభాలు కలగాలని కలెక్టర్ కాంక్షించారు.