ముస్లిం సోదరులకు ఘనంగా ఇఫ్తార్ విందు
జామీయా మస్జీద్ లో ఇఫ్తార్ విందు ఇచ్చిన వెల్దుర్తి సీఐ, ఎస్సైలు
వెల్దుర్తి, మార్చి 11, (సీమకిరణం న్యూస్ ) :

రంజాన్ మాస ఉపవాస దీక్షలతో పుణ్యఫలం, ఆరోగ్యం చేకూరుతుందని వెల్దుర్తి సర్కిల్ సీఐ యుగంధర్, ఎస్సై నరేష్ అన్నారు. స్థానిక వెల్దుర్తి జామీయా మస్జీద్ లో బుధవారం సాయంత్రం ముస్లిం సోదరుల ప్రార్థనల అనంతరం సీఐ యుగంధర్, ఎస్సై నరేష్ సిబ్బందితో కలిసి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. వారు స్వయంగా ముస్లిం సోదరులకు వడ్డించారు. ఈ సందర్భంగా ముస్లిం గురువులు, జామియా మసీద్ కమిటీ సభ్యులు దువా అనంతరం సీఐ యుగంధర్, ఎస్సై నరేష్ లను శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీఐ యుగంధర్, ఎస్ఐ నరేష్ లు మాట్లాడుతూ ముస్లిం సోదరులు రంజాన్ మాసం అంతా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారని, పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఆచరించే ముస్లిం సోదరులకు ఇచ్చే ఇఫ్తార్ విందు లాంటి కార్యక్రమాలు ప్రజలలో సోదర భావాన్ని పెంపొందిస్తాయన్నారు. రంజాన్ మాసం త్యాగానికి, దానధర్మాలకు, దైవచింతనకు ప్రతీక అని, ఈ మాసంలో ఉపవాస దీక్షలు, ప్రార్థనలు చేయడం ద్వారా మనలోని చెడు ఆలోచనలను, అలవాట్లను విడిచిపెట్టి మంచి మార్గంలో నడవడానికి దోహదం చేస్తుందన్నారు. ఉపవాసాలు ఉండే ముస్లింలు వేసవి కాలంలో తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రజలు అన్ని పండుగలను ప్రశాంత వాతావరణంలో కలిసి మెలిసి ఆనందోత్సవాల మధ్య నిర్వహించుకోవాలని వారు సూచించారు. అనంతరం ముస్లిం గురువులు మాట్లాడుతూ అల్లాహ్ దీవెనలతో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో గురువులు, కమిటీ సభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.