గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు గ్యాస్ డెలివరీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు
కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యంపై అసహనం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్
గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యంకు నోటీస్ లు ఇవ్వాలని డి ఎస్ ఓ ను ఆదేశించిన జిల్లా కలెక్టర్
గోడౌన్ పరిధిలో నిబంధనల ప్రకారం అగ్ని మాపక భద్రతా చర్యలను పాటించకపోవడం ఏంటని ప్రశ్నించిన జిల్లా కలెక్టర్
కర్నూలు ప్రతినిధి/ వెల్దుర్తి , మార్చి 26, (సీమకిరణం న్యూస్):
గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు గ్యాస్ డెలివరీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి హెచ్చరించారు. గురువారం వెల్దుర్తి మండల కేంద్రంలోని సంపూర్ణ ఇండెన్ గ్యాస్ గోడౌన్ ను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా గ్యాస్ గోడౌన్ ను పరిశీలిస్తూ ప్రతి రోజు ఎన్ని గ్యాస్ సిలిండర్ లను సరఫరా చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. స్టాక్ ను పరిశీలిస్తూ, 6 డొమెస్టిక్ సిలిండర్లు,11 కమర్షియల్ సిలిండర్ లు తక్కువగా ఉండడం పట్ల కలెక్టర్ గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం మీద అసహనం వ్యక్తం చేస్తూ, వెంటనే వారికి నోటీస్ లు ఇవ్వాలని కలెక్టర్ డి ఎస్ ఓ ను ఆదేశించారు. ఈ సందర్భంగా గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు గ్యాస్ డెలివరీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. అదే విధంగా గోడౌన్ పరిధిలో నిబంధనల ప్రకారం అగ్ని మాపక భద్రతా చర్యలను పాటించకపోవడం ఏంటని ప్రశ్నిస్తూ, తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అగ్నిమాపక శాఖ అధికారిని ఆదేశించారు. గ్యాస్ డెలివరీ బాయ్ లకు జీత భత్యాలు సరిగా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, అప్పుడే వారు గ్యాస్ డెలివరీ చేసే ఇంటి వద్ద అధిక వసూలు చేయరని కలెక్టర్ తెలిపారు. వారికి జీత భత్యాలు ఇవ్వకపోవడం వల్ల అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని, అందువల్ల పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ లో ప్రజల నుండి నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వస్తుందని కలెక్టర్ తెలిపారు. డెలివరీ బాయ్స్ వినియోగదారుల నుండి అదనంగా డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లాలో గ్యాస్ కొరత లేదని, 18 వేల సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్టర్ ప్రజలకు సూచించారు. జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ మాట్లాడుతూ ప్రజలు గ్యాస్ ను పొదుపుగా వాడుకోవాలని, డొమెస్టిక్ సిలిండర్లను వంటకు మాత్రమే ఉపయోగించుకోవాలని, గీజర్లకు, వాహనాలకు, ఇతర అవసరాలకు వాడుకోకూడదని జాయింట్ కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, డిఎస్ఓ రాజా రఘువీర్, అగ్ని మాపక శాఖ అధికారి జయసింహ, లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ రాముడు తదితరులు పాల్గొన్నారు.