seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 18 March 2026, 1:50 pm Digital Edition : SEEMA KIRANAM

కష్టాల్లో ఉన్న మిత్రుడికి చేయూత

సంతోషంలోనే కాదు.. కష్టాల్లోనూ తోడుంటామని నిరూపించిన స్నేహితులు

 

అనారోగ్యంతో బాధపడుతున్న మిత్రుడికి ఆర్థిక సాయం

 

 

స్నేహబంధాన్ని చాటుకున్న క్లాస్‌మేట్స్

 

 

 వెల్దుర్తి, మార్చి 18, (సీమకిరణం న్యూస్) :

వెల్దుర్తి పట్టణానికి చెందిన నిరుపేద ఆటోడ్రైవర్ యాసీన్ తన టాటా ఏసి ఆటో నడుపుతూ తల్లి, మతిస్థిమితం లేని చెల్లి, భార్య, ఇద్దరు మగ పిల్లలను పోషించుకునేవాడు. విధి ఆడిన వింత నాటకంలో చిన్నప్పుడు లారీ డ్రైవర్ గా ఉన్న తండ్రి చాంద్ బాషా మరణించాడు. తల్లి తన ఇద్దరు కుమారులను, మతిస్థిమితం లేని కుమార్తె ను పెంచి పెద్ద చేసింది. తన ఇద్దరు కుమారులకు వివాహం చేసింది. అందరు కలిసి ఉంటున్నారు. తల్లి బాధ్యతను భుజాన వేసుకున్న పెద్ద కుమారుడు యాసీన్ ఆటో నడుపుతూ తల్లి, చెల్లి,తన కుటుంబాన్ని పోషించేవాడు.యాసీన్ భార్య షమీమ్ బాను గత 4సంవత్సరాల క్రితం కాన్సర్ తో చనిపోయింది. తన ఇద్దరు కుమారులను చూసుకుంటూ అతను జీవనం సాగించేవాడు. అయితే ఇటీవల పసిరికలు, టీబీ వ్యాధికి గురై అవస్థలు పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఆటో అమ్మేశాడు. వెల్దుర్తి సిహెచ్ సీ వైద్యశాలలో అడ్మిట్ అయ్యాడు. వ్యాధులు తీవ్రమై కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. డిశ్చార్జ్ అయి ఇప్పుడు ప్రస్తుతం ఇంట్లోనే శారీరకంగా చాలా బలహీనపడి తన వృత్తిని చేసుకోలేక ఆర్థిక ఇబ్బందులతో ఉన్నాడు. తనతో పాటు వెల్దుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరవ తరగతి నుండి పదవ తరగతి( 2000- 2001)వరకు చదువుకున్న తన చిన్ననాటి మిత్రులు క్లాస్ మెంట్స్ దాతలుగా ముందుకు వచ్చి ఆటో డ్రైవర్ యాసీన్ కుటుంబాన్ని ఆదుకొని పదహారు వేల రూపాయలు ఆర్థిక సహాయంగా నగదును, నాలుగు వేల రూపాయల నిత్యావసర సరుకులను అందించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాసిన్ కుటుంబాన్ని ఆదుకోవడానికి 2000- టు 2001మా పదవ తరగతి మిత్రులందరము ఏకమై కృషి చేస్తున్నామని ఆయన పూర్తిగా కోలుకొని ఆరోగ్యవంతుడై తన కుటుంబాన్ని పోషించే వరకు ఆయన కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకు వస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 2000 టు 2001వ సంవత్సరం వెల్దుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదవ తరగతి పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.