కర్నూలు అర్బన్ ఎమ్మార్వో కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ప్రజా సమస్యల పరిష్కారంలో రెవెన్యూ శాఖ ఎల్లప్పుడూ ముందుంటుంది
“రెవెన్యూ శాఖ పరంగా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, పారదర్శకంగా సేవలు అందించడమే ముఖ్య లక్ష్యం” — కర్నూలు అర్బన్ ఎమ్మార్వో రవి కుమార్
కర్నూలు ప్రతినిధి, ఆగస్టు 15, (సీమకిరణం న్యూస్):
కర్నూలు అర్బన్ తహసీల్దార్ (ఎమ్మార్వో) కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శుక్రవారం అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కర్నూలు అర్బన్ ఎమ్మార్వో రవి కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, జాతీయ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రవి కుమార్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల త్యాగాలు అమూల్యమైనవని స్మరించుకున్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రెవెన్యూ శాఖ పరంగా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, పారదర్శకంగా సేవలు అందించడమే తమ ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు, కార్యాలయ పరిపాలనా సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపులో పాల్గొన్న వారందరికీ తీపి పదార్థాలు పంపిణీ చేసి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.