పిల్లల్లో కంటి చూపు సమస్యలకు సెల్ ఫోన్లే కారణం
ప్రముఖ కంటి వైద్య నిపుణురాలు ( ఆప్తాల్మాలజిస్ట్) డాక్టర్ లక్ష్మీ ప్రసన్న
ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన
వెల్దుర్తి , ఏప్రిల్ 16, (సీమకిరణం న్యూస్):

దేశంలో కంటి సమస్యల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కంటి సమస్యలపై ప్రజలకు అవగాహన అవసరమని ప్రముఖ కంటి వైద్య నిపుణురాలు ( ఆప్తాల్మాలజిస్ట్) డాక్టర్ లక్ష్మీ ప్రసన్న తెలిపారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో హెల్పింగ్ హ్యాండ్స్ సేవా సంస్థ గౌరవ అధ్యక్షులు కొరపోలు నాగేంద్ర ప్రసాద్ తల్లిదండ్రులు నారాయణ శర్మ, అన్నపూర్ణమ్మ కొరపోలు వారి సహాయ సహకారాలతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కర్నూలు జిల్లాలో మంచి పేరున్న కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ లక్ష్మీ ప్రసన్న వెల్దుర్తి పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన దాదాపు 100 మంది ప్రజలకు ఉచితంగా కంటి వైద్యం అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ కంటి సమస్యలు ముఖ్యంగా వయసు పెరుగుతున్న అందరికీ వస్తాయని కనుక రెగ్యులర్గా కళ్ళను కంటి వైద్యులతో చెకప్ చేయించుకోవాలని కోరారు. ఎంతోమంది పెద్దలకు కంటి శుక్లాలు కంటి పొరలు ఏర్పడి నిర్లక్ష్యంతో అవి ముదిరిపోయి శాశ్వతంగా అంధత్వం వచ్చే ప్రమాదం ఉందని అందువలన వైద్య సహాయాన్ని పెద్దలు వెంటనే అందిపుచ్చుకోవాలని కోరారు.ఇప్పుడు ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా కంటి శస్త్ర చికిత్సలు చేస్తున్నారని వాటిని ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శ్రీమతి స్వయంప్రభ మాట్లాడుతు సెల్ఫోన్ల వాడకంతో నేటి యువతరం సర్వేంద్రియం నయనం ప్రధానం అంతటి గొప్ప కళ్ళను చేతులారా కంటి చూపును నాశనం చేసుకుంటున్నారని రాత్రి నిదురను పక్కన పెట్టి సెల్ ఫోన్ లో గంటలు గంటలు గడుపుతు కళ్ళను ప్రమాదంలో పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గంటకు మించి సెల్ఫోన్లను చూడవద్దని కోరారు. పిల్లలకు మంచి పోషక విలువలను ఆహారాన్ని అందించినప్పుడు కంటిచూపు మెరుగ్గా ఉండి చదువులో రాణించగలరని చదువులో వెనుక పడుతుంటే వెంటనే కంటి పరీక్షలను నిర్వహించాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీప్రసన్నను, హిందీ పండిట్ స్వయంప్రభను హెల్పింగ్ హాండ్స్ సేవా సంస్థ తరపున శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమానికి సహకరించిన కొరపోలు నాగేంద్రప్రసాదును పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత విశ్రాంత హింది పండిట్ శ్రీమతి స్వయంప్రభ, వైద్య సహాయకులు దిలీప్ ,హెల్పింగ్ హ్యాండ్స్ సేవా సంస్థ అధ్యక్షులు హరి సింహానాయుడు, వైద్యం రామానాయుడు, సత్యం, ప్రతాప్, క్రికెటర్ శ్రీకాంత్, రమణ డాక్టర్ పోతులూరి ఆచారి, స్వాములు, లాయర్ గిరిబాబు, మహేష్, కురువ రామకృష్ణ, శాంతి, శశికళ తదితరులు పాల్గొన్నారు.