seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 9:33 am Digital Edition : SEEMA KIRANAM

ఉలిందకొండ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్

రోడ్డు ప్రమాదాల నివారణకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలి – ఎస్పీ

 

సైబర్ మోసాలు, మహిళల భద్రతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచన

 

ఉలిందకొండ, ఆగస్టు 04, (సీమకిరణం న్యూస్) :

 

కర్నూలు జిల్లా ఉలిందకొండ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఐపీఎస్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని రికార్డులు, కేసు ఫైళ్లు, దర్యాప్తు పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్‌లో నమోదైన పెండింగ్ కేసుల స్థితిగతులు, నిందితుల అరెస్టులు, దర్యాప్తు పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ప్రాపర్టీ కేసులను త్వరితగతిన చేధించి, దొంగిలించిన ఆస్తులను బాధితులకు తిరిగి అందించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించిన ఎస్పీ, డ్రంకెన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ వంటి ఉల్లంఘనలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంపొందించే కార్యక్రమాలను కూడా నిర్వహించాలని చెప్పారు. పోలీసుల విజిబుల్ పోలీసింగ్ మరింత బలోపేతం చేయాలని, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి బాధితుడి సమస్యను సానుభూతితో విని, త్వరితగతిన పరిష్కారం చూపాలని సూచించారు. అలాగే సైబర్ నేరాలు, మహిళలపై జరిగే నేరాలు, మహిళల రక్షణ చట్టాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, గ్రామాలు, విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీలో కర్నూలు రూరల్ సీఐ చంద్రబాబు నాయుడు, ఉలిందకొండ ఎస్సై నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.