తెలంగాణ
-లింగారెడ్డి గజ్జల
శతాబ్దాల చరిత్రకు సాక్ష్యమైన బ్రిటన్ పార్లమెంట్ ఎగువ సభ ‘హౌస్ ఆఫ్ లార్డ్స్’ వేదికపై తెలంగాణ పేరు మారుమోగింది. సిద్దిపేట జిల్లా శనిగారం గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజు (ఉదయ్ నాగరాజు) జీవితకాల సభ్యుడిగా (లైఫ్ పీర్) ప్రమాణ స్వీకారం చేసి కొత్త అధ్యాయాన్ని ఆరంభించారు. బ్రిటిష్ సంప్రదాయాల ప్రకారం ఎరుపు రంగు ప్రత్యేక గౌను ధరించి, పవిత్ర భగవద్గీతపై ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించడం ఈ వేడుకకు ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఇకపై ఆయనను ప్రపంచవ్యాప్తంగా ‘లార్డ్ నాగరాజు ఆఫ్ బ్లూమ్స్బరీ’గా పిలుస్తారు.

ఉదయ్ నాగరాజు: గాంధేయ ఆలోచనలకు గ్లోబల్ వేదిక
లార్డ్ నాగరాజు ప్రస్థానం కేవలం రాజకీయ గుర్తింపుకే పరిమితం కాదు. యువతలో నైతిక నాయకత్వం, సామాజిక న్యాయం, గాంధేయ విలువలను పెంపొందించాలనే లక్ష్యంతో ఆయన స్థాపించిన ‘మహాత్మా గాంధీ ఫ్యూచర్ లీడర్స్ ప్రోగ్రామ్’ విశేష గుర్తింపు పొందింది. భారతీయ తత్వాన్ని ప్రపంచ వేదికలపై చాటిచెప్పే ప్రయత్నంలో ఆయన ముందుంటున్నారు.
అలాగే ఆధునిక సాంకేతిక రంగంలోనూ ఆయన ముద్ర వేశారు. కృత్రిమ మేధ), గ్లోబల్ గవర్నెన్స్ పరిశోధన (AI పాలసీ ల్యాబ్స్) అనే థింక్ట్యాంక్ను స్థాపించారు. సాంకేతికతను సామాజిక ప్రయోజనాలకు మలచడంలో ఆయన చేసిన కృషి బ్రిటన్ ప్రభుత్వ దృష్టిని ఆకర్షించింది.
లైఫ్ పీరేజ్ గౌరవం
బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ సిఫార్సు ప్రకారం కింగ్ చార్లెస్ III ఆయనకు ఈ జీవితకాల పీరేజ్ ప్రదానం చేశారు. ఇది బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థలో అత్యున్నత గౌరవాలలో ఒకటి. హౌస్ ఆఫ్ లార్డ్స్లో చట్టాల పరిశీలన, జాతీయ స్థాయి చర్చల్లో పాల్గొనే అవకాశంతో ఆయనకు కీలక బాధ్యతలు లభించాయి.
రెండేళ్ల క్రితం నార్త్ బెడ్ఫోర్డ్షైర్ నియోజకవర్గం నుంచి లేబర్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో రెండో స్థానంలో నిలిచారు, ప్రజా సేవలో చేసిన కృషి కారణంగా ఈ గౌరవం ఆయనకు దక్కింది.
సిద్దిపేట నుంచి బ్లూమ్స్బరీ వరకు
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగారం గ్రామంలో జన్మించిన నాగరాజు దాదాపు 25 ఏళ్ల క్రితం ఉన్నత విద్య కోసం బ్రిటన్కు వెళ్లారు. లండన్లోని ప్రఖ్యాత యూనివర్సిటీ కాలేజ్ లండన్ (UCL)లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ పూర్తి చేశారు. మహాత్మా గాంధీ చదివిన ఈ విద్యాసంస్థతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. ప్రస్తుతం అక్కడ గౌరవ లెక్చరర్గా సేవలందిస్తున్నారు.
తన విద్యా ప్రయాణానికి ప్రాధాన్యతనిచ్చేలా ‘బ్లూమ్స్బరీ’ పేరును తన బిరుదులో చేర్చి ఆయన మూలాలను గౌరవించే స్వభావాన్ని ప్రతిబింబిస్తోంది.
ప్రవాసుల గర్వకారణం
భారతీయ సంస్కృతిని గౌరవిస్తూ భగవద్గీతపై ప్రమాణం చేసిన నాగరాజు తీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు గర్వపడేలా చేసింది. ఇది వ్యక్తిగత విజయమే కాకుండా తెలంగాణకు, భారతీయులకు దక్కిన గౌరవంగా ఉంది.
శనిగారం మట్టి నుంచి బ్రిటన్ పార్లమెంట్ మెట్లు ఎక్కిన ఈ ప్రయాణం అనేకమందికి స్ఫూర్తి. స్థానిక గ్రామ పాఠశాల ప్రపంచ చట్టసభల వరకు ఎదిగిన ఈ కథనం.. సాధారణ కుటుంబం నుంచి కూడా గ్లోబల్ వేదికలపై ముద్రవేయడం ద్వారా నిరూపిస్తోంది.

