seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 8:12 am Digital Edition : SEEMA KIRANAM

ఉత్తమ తహసీల్దార్‌గా కల్లూరు ఎమ్మార్వో ఆంజనేయులు

ఉత్తమ తహసీల్దార్‌గా కల్లూరు ఎమ్మార్వో ఆంజనేయులు

 

మంత్రి టీజీ భరత్, కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న కల్లూరు ఎమ్మార్వో ఆంజనేయులు

 

కర్నూలు ప్రతినిధి, ఆగస్టు 15, (సీమకిరణం న్యూస్):

 

ప్రజా సేవలో విశేష ప్రతిభ కనబరిచిన కల్లూరు మండల తహసీల్దార్ (ఎమ్మార్వో) ఆంజనేయులు ‘ఉత్తమ తహసీల్దార్’ అవార్డును దక్కించుకున్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా కర్నూలు నగరంలోని పోలీసు పరేడ్ మైదానంలో శనివారం ఘనంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, వాణిజ్య శాఖ మంత్రి టి.జి. భరత్, జిల్లా కలెక్టర్ల చేతుల మీదుగా ఆయన ఈ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ రెవెన్యూ సేవలను సమర్థవంతంగా అందించడం, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సమన్వయంతో అమలు చేయడం మరియు ప్రజా సమస్యల పరిష్కారంలో నిరంతరం చొరవ చూపినందుకు గాను ఆంజనేయులుకు ఈ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ప్రశంసా పత్రం అందుకున్న అనంతరం ఎమ్మార్వో ఆంజనేయులు మాట్లాడుతూ “రాష్ట్ర మంత్రి టీజీ భరత్, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఈ ప్రశంసా పత్రం అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ గుర్తింపు నాపై మరింత బాధ్యతను పెంచింది. భవిష్యత్తులో ప్రజలకు మరిన్ని మెరుగైన రెవెన్యూ సేవలు అందించేందుకు శ్రమిస్తాను” అని పేర్కొన్నారు. అవార్డు గ్రహించిన తహసీల్దార్ ఆంజనేయులును రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు పలువురు అభినందించారు.