seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 9:11 am Digital Edition : SEEMA KIRANAM

ఉచిత సిమ్ కార్డుల పేరుతో మోసాలకు గురి కావద్దు…

ఉచిత సిమ్ కార్డుల పేరుతో మోసాలకు గురి కావద్దు… అపరిచితులను నమ్మవద్దు

 

ఎక్కడపడితే అక్కడ ఉచిత సిమ్ కార్డులు కొనుగోలు చేయవద్దు

 

అధికారిక టెలికాం కేంద్రాల్లోనే సిమ్ కార్డులు పొందాలి

 

సైబర్ నేరగాళ్ళు చేసే మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

 

కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ 

 

 

కర్నూలు క్రైమ్, జూలై 29, (సీమకిరణం న్యూస్):

 

ఉచిత సిమ్ కార్డులు, బహుమతులు లేదా ప్రభుత్వ పథకాలు, ఇతర ఆకర్షణీయ ఆఫర్ల పేరుతో కొందరు మోసగాళ్లు ప్రజల వ్యక్తిగత, బ్యాంకు వివరాలను సేకరించి సైబర్ మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్  బుధవారం తెలిపారు.  ప్రభుత్వ పథకాల లబ్ధి ఇప్పిస్తామని లేదా ఉచిత సిమ్ కార్డులు ఇస్తామని చెప్పి ఆధార్ నంబర్, వేలిముద్రలు, ఐరిస్ స్కాన్, ఓటీపీ , బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం కార్డు వివరాలు, యూపీఐ పిన్ వంటి గోప్యమైన సమాచారాన్ని అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వవద్దని హెచ్చరించారు. ప్రభుత్వ పథకాల కోసం సంబంధిత అధికారిక ప్రభుత్వ కార్యాలయాలు, స్వర్ణ గ్రామ/ స్వర్ణ వార్డు సచివాలయాలు, అధికారిక వెబ్‌సైట్ల ద్వారానే దరఖాస్తు చేసుకోవాలని, అపరిచితులు పంపే లింకులు క్లిక్ చేయవద్దని, గుర్తు తెలియని యాప్‌లను మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేయవద్దని సూచించారు. ఉచిత సిమ్ కార్డులు జారీ చేస్తామని చెప్పే అపరిచిత వ్యక్తులు లేదా ఏజెంట్లను నమ్మవద్దని , ఎక్కడపడితే అక్కడ లేదా అనధికారిక వ్యక్తుల వద్ద సిమ్ కార్డులు కొనుగోలు చేయవద్దని సూచించారు. సిమ్ కార్డులను టెలికాం సంస్ధల అధికారిక కార్యాలయాలు లేదా గుర్తింపు విక్రయ కేంద్రాల్లో మాత్రమే పొందాలన్నారు. ఆధార్ , బయోమెట్రిక్ గోప్యమైన సమాచారాన్ని సంబంధిత అధికారిక సంస్థకు మాత్రమే అందించాలని సూచించారు. సైబర్ మోసానికి లేదా ఇతర ఆర్ధిక మోసానికి గురైనట్లు అనుమానం వచ్చిన వెంటనే ఆలస్యం సమయం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలని లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు నమోదు చేయాలని అలాగే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్  ప్రజలకు విజ్ఞప్తి చేశారు.