మట్టి ముద్ద తలపై పడి సురేష్ మృతి
వెల్దుర్తి పరిధిలో విషాదం
కేసు నమోదు చేసుకున్న వెల్దుర్తి పోలీసులు
వెల్దుర్తి, మే 26, (సీమ కిరణం న్యూస్):
ఇటుకల బట్టీ కోసం చెరువులో మట్టిని తరలిస్తుండగా జరిగిన ప్రమాదంలో ఒకరు దుర్మరణం పాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. నెల్లూరు జిల్లా జలదంకి మండలం తిమ్మసముద్రం గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తి ఉలిందకొండ పరిధిలో ఇటుకల బట్టీ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో బట్టీ తయారీ కోసం సర్పరాజు పురం గ్రామ పరిధిలోని చెరువు నుండి మట్టిని టిప్పర్ లారీలో లోడ్ చేయించారు. అయితే, టిప్పర్ బాడీ లెవెల్ కంటే చాలా ఎత్తుగా మట్టిని ఓవర్ లోడ్ చేశారు. మట్టితో నిండిన ఆ టిప్పర్ను చెరువు లోపలి నుండి బయటకు తీస్తున్న సమయంలో టిప్పర్ ఒక్కసారిగా క్రిందికి ఒరిగింది.
తలపై పడిన మట్టి ముద్ద..
టిప్పర్ ఒరగడంతో పైభాగంలో ఉన్న ఒక భారీ మట్టి ముద్ద పక్కనే నిలబడి ఉన్న సురేష్ తలపై పడింది. ఈ తీవ్రమైన దెబ్బకు ఆయన అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయారు. గమనించిన స్థానికులు, కార్మికులు వెంటనే ఆయన్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడి అన్న రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. సురేష్ హఠాన్మరణంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.