ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో నేడు, రేపు మంత్రుల ఔట్రీచ్ కార్యక్రమం
ఆలూరు, ఆగస్టు 23, (సీమకిరణం న్యూస్):
కర్నూలు జిల్లా ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో మంత్రుల ఔట్రీచ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. స్థానిక ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు మరియు అభివృద్ధి పనుల వేగవంతమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది.
సోమవారం ఆలూరులో సమీక్ష..
సోమవారం (ఆగస్టు 24) ఉదయం 10 గంటలకు ఆలూరు మండల కేంద్రంలో జిల్లా ఇన్చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు తీరుపై అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులతో మంత్రులు ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
మంగళవారం మంత్రాలయంలో పర్యటన
మంగళవారం (ఆగస్టు 25) మంత్రాలయం నియోజకవర్గంలో నిర్వహించే ఔట్రీచ్ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా ఇన్చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొననున్నారు. మంత్రుల వరుస పర్యటనల నేపథ్యంలో ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాల అధికారులు పర్యటనకు సంబంధించి అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లను పూర్తి చేశారు.