ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా జస్టిస్ మల్లిఖార్జున రావు ప్రమాణ స్వీకారం
విజయవాడ, ఆగస్టు 25, (సీమకిరణం న్యూస్) :
ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా నియమితులైన హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లిఖార్జునరావుతో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో లోక్ భవన్ దర్బార్ హాల్ లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేయించారు. జిఏడి ముఖ్య కార్యదర్శి జె. శ్యామలరావు, కార్యక్రమాన్ని ప్రారంభించారు, ఆ తర్వాత లోకాయుక్త రిజిస్ట్రార్ ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లిఖార్జునరావును నియమిస్తూ గవర్నర్ జారీ చేసిన అపాయింట్మెంట్ వారెంట్ను చదివి వినిపించారు. అనంతరం, ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త జస్టిస్ (రిటైర్డ్) తల్లాప్రగడ మల్లిఖార్జునరావును గవర్నర్ అబ్దుల్ నజీర్ మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించి పుష్పగుచ్ఛాలు అందించారు. ఈ కార్యక్రమంలో కార్మిక, కర్మాగారాలు, బాయిలర్లు & బీమా వైద్య సేవల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, హైకోర్ట్ న్యాయమూర్తులు, డిజిపి హరీష్ కుమార్ గుప్తా, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. అనంతరాము, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, ఏపీ శాసనసభ సెక్రటేరియట్ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర, న్యాయశాఖ అధికారులు, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.