seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 12 February 2026, 5:11 pm Digital Edition : SEEMA KIRANAM

అర్హతలు కలిగిన వారికి మీడియా అక్రిడిటేషన్ కార్డులు

అర్హతలు కలిగిన వారికి మీడియా అక్రిడిటేషన్ కార్డులు మంజూరు

 

కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి

 

కాకినాడ, ఫిబ్రవరి 12, (సీమకిరణం న్యూస్):

మీడియా అక్రిడిటేషన్ కార్డులు పొందుటకు జర్నలిస్టులు ఎవరికీ డబ్బులు చెల్లించనవసరం లేదని, అర్హతలు కలిగిన వారు అవసరమైన పత్రాలతో తనను నేరుగా కలిసి ధరఖాస్తులు అందజేయవచ్చునని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఒక ప్రకటనలో తెలిపారు. కాకినాడ జిల్లాలో ఇప్పటి వరకూ 489 మంది జర్నలిస్టులకు 2026-2027 ద్వైవార్షిక కాలానికి జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఆమోదించిందని, అక్రిడిటేషన్లు జారీ చేసిన జర్నలిస్టుల జాబితాను కలెక్టరు కార్యాలయంలోని నోటీసు బోర్డులో పారదర్శకంగా ప్రదర్శిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ జాబితాలోని జర్నలిస్టులు, ఇంకా ధరఖాస్తు చేసుకోనే జర్నలిస్టులు అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం మీడియా సంస్థలకు గానీ, మీడియా సంఘాలకు గానీ, అక్రిడిటేషన్ కమిటీ సభ్యులకు గానీ, సమాచార శాఖ అధికారులు, సిబ్బంది గానీ, లేదా మరే మీడియేటర్లకు గానీ ఎవరికీ ఎటువంటి సొమ్ము చెల్లించనవసరం లేదని కలెక్టర్ స్పష్టంచేసారు. జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాల కొరకు రాష్ట్ర ప్రభుత్వం అందించే ఈ మీడియా అక్రిడిటేషన్ కార్డులు జారీకి జర్నలిస్టుల అర్హతే ప్రమాణికమని, దళారులకు డబ్బులు చెల్లించి నష్టపోవద్దని ఆయన జర్నలిస్టులకు సూచించారు. సంస్థలు, సంఘాలు, అధికారులు, సిబ్బంది ఎవరైనా అక్రిడిటేషన్లు జారీ చేసేందుకు డబ్బులు డిమాండు చేస్తే బాధితులు తన దృష్టికి తెవాలని, అటువంటి చర్యలకు పాల్పడిన సంస్థలు, సంఘాలను బ్లాక్ లిస్ట్ చేస్తామని, దళారులు, అధికారులు, సిబ్బంది పై కఠిన చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.