seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 07 March 2026, 4:30 pm Digital Edition : SEEMA KIRANAM

అధ్వానంగా మారిన మురికి కాలువలు

అధ్వానంగా మారిన మురికి కాలువలు

 

మురుగు కాలువలు శుభ్రం చేయండి

 

15వ వార్డు ప్రజలు

 

 

వెల్దుర్తి, మార్చి 06, (సీమకిరణం న్యూస్) :

కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని వెల్దుర్తి మండల కేంద్రంలో 15వ వార్డు నందు మురికి కాలువలు శుభ్రం చేయకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాలువలు చాలా రోజులుగా శుభ్రం చేయకపోవడంతో మురుగు నీరు నిల్వ ఉండి దుర్వాసన వ్యాపిస్తోంది. దీంతో పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక గ్రామస్తులు చెబుతున్న వివరాల ప్రకారం వార్డులో మురికి కాలువలు తీయడానికి పంచాయతీ సిబ్బంది రావడం లేదని తెలిపారు. ఇంటి పన్నులు, ఇతర చార్జీలు వసూలు చేయడానికి మాత్రం అధికారులు తరచూ వస్తున్నారని, కానీ వార్డులో ఉన్న సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చూపుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై పలుమార్లు పంచాయతీ కార్యాలయాన్ని ఆశ్రయించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు తెలిపారు. పంచాయతీ బోర్డు వద్దకు వెళ్లి ఈవో లక్ష్మీ నాథ్ ను ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మురికి కాలువలు శుభ్రం చేయకపోవడంతో దోమలు పెరిగి, దుర్వాసన వ్యాపించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి మురికి కాలువలను శుభ్రం చేయాలని, వార్డులోని పలు సమస్యలను పరిష్కరించాలని 15వ వార్డు ప్రజలు కోరుతున్నారు.