భారతదేశం
ఓయ్-సయ్యద్ అహ్మద్
ప్రస్తుతం సోషల్ మీడియా (ఇంటర్నెట్) ప్లాట్ ఫామ్స్ లో ఎక్కడ చూసినా రెండు ఘటనలు, ఇద్దరు వ్యక్తులు హల్ చల్ చేస్తున్నారు. వీరిద్దరూ నిన్న మొన్నటి వరకూ సాధారణ వ్యక్తులే. చిన్న వ్యాపారులే. కానీ తెలంగాణ, ఉత్తరాఖండ్ లో జరిగిన రెండు ఘటనలు ఇప్పుడు భారత్ లో ప్రజలందరినీ కుల, మతం, ప్రాంతం, వర్గాలకు అతీతంగా ఏకం చేస్తున్నాయి. వీరికి అండగా నిలిచేందుకు, కనీసం మద్దతు ప్రకటించేందుకు సాధారణ ప్రజలతో పాటు రాజకీయ నేతలు, సెలబ్రిటీలు క్యూ కడుతున్నారు. ఇంతకీ వీళ్లిద్దరి కథలేంటో ఓసారి చూద్దాం..
ముందుగా ఉత్తరాఖండ్ లోని కోట్వార్ లో జనవరి 26న బాబా స్కూల్ డ్రెస్ పేరుతో బట్టల దుకాణం నడుపుకుంటున్న ఓ ముస్లిం వృద్ధ వ్యాపారి వకీల్ అహ్మద్ పై భజరంగ్ దళ్ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. బాబా పేరుతో దుకాణం ఎలా నడుపుతుందని ప్రశ్నించారు. అదే సమయంలో పక్కనే జిమ్ నడుపుతున్న దీపక్ కుమార్ అక్కడికి చేరుకుని అతనికి అండగా నిలిచాడు. భజరంగ్ దళ్ కార్యకర్తలను ప్రశ్నించాడు. నీ పేరు ఏంటని అడిగితే దీపక్ అన్నాడు. హిందువై ఉండి ముస్లిం వ్యాపారికి ఎలా సపోర్ట్ చేస్తావని అడిగితే తాను మొహమ్మద్ దీపక్ అయితే ఫర్వాలేదా అని అడిగాడు. దీంతో వాగ్వాదం పెరిగి కేసుల వరకూ వెళ్లింది. అయినా దీపక్ బెదరలేదు. ఇప్పుడు ఈ మొహమ్మద్ దీపక్ కు దేశమంతా మద్దతు పలుకుతోంది.

అదే సమయంలో అతను నడుపుతున్న జిమ్ కు వచ్చే 150 మంది కాస్తా 15కు పడిపోయారు. ప్రతి రోజూ అతని జిమ్ దగ్గర ఏదైనా గొడవ జరుగుతుందన్న భయంతో పోలీసులు మోహరిస్తున్నారు. దీంతో జిమ్ కు వచ్చే వారు రాకుండా పోయారు. ఇది అతని ఉపాధిని తీవ్రంగా దెబ్బతీసింది. విషయం తెలిసిన చాలా మంది అతనికి అండగా నిలుస్తున్నారు. అతని జిమ్ కు తాము సబ్ స్కిప్షన్ కడతామని ముందుకొస్తున్నారు. ఇందులో తెలుగువారు కూడా ఉన్నారు. జైపూర్ లోని ఓ ఎన్జీవో జిమ్ లో చేరే తొలి 100 మందికి తామే డబ్బులు కడతామంటోంది.
సీన్ కట్ చేస్తే తెలంగాణలోని మేడారం జాతర. అందులో కోవా బన్ అమ్ముకునేందుకు ఎక్కడో రాయలసీమ నుంచి వచ్చిన షా వలీ అనే ఓ ముస్లిం పేద వ్యాపారి. అతను కేవలం కోవా బన్ను 10 రూపాయలకు అమ్ముతున్నాడన్న కారణంతో, దాని నాణ్యతను ప్రశ్నిస్తూ ఓ యూట్యూబ్ ఛానల్ ప్రతినిధులు ఫుడ్ జిహాద్ పేరుతో అతనిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇది చూసి పక్కనే ఉన్న వారు పోగయ్యారు. చివరికి ఆ బన్ నువ్వు తిను అంటూ అతన్ని గేలిచేశారు. దాంతో వెంటనే ఆ బన్ తాను తిని చూపించాడు. దాంతో అక్కడున్న వారికి నోటమాటలేకుండా పోయింది.

రాయలసీమకు చెందిన షేక్ షావలి ఇటీవల జరిగిన మేడారం జాతరలో కోవా బాన్ అమ్ముకుంటుండగా ఒక మతోన్మాద యూట్యూబ్ చానెల్ వారు ఆయన మీద తప్పుడు ప్రచారం చేశారు.
అయితే ఒక చిరువ్యాపారి మీద ఈ దుర్మార్గానికి నిదర్శన మతోన్మాదుల మీద సోషల్ మీడియాలో వ్యతిరేకత వెల్లువెత్తింది. షేక్ షావలికి అండగా… pic.twitter.com/aBJZoykNVT
— కొణతం దిలీప్ (@KonathamDileep) ఫిబ్రవరి 13, 2026
ఈ దృశ్యాలు ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. ఆ షా వలీకి మద్దతుగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎంతో మంది జర్నలిస్టులు, సామాజిక నాయకులు, సాధారణ ప్రజలు ట్వీట్లు చేస్తున్నారు. ఆ పేద వ్యాపారి పొట్టకొట్టేందుకు మతం పేరును వాడుకున్న ఫేక్ జర్నలిస్టులతో పాటు అక్కడ గుమికూడిన వారిని సైతం చీదరించుకుంటూ జనం పోస్టులు పెడుతున్నారు. అక్కడితో ఆగకుండా ఆ పేద వ్యాపారి ఫోన్ పే అడ్రస్ తీసుకుని వారికి తోచినంత డబ్బులు సైతం పంపుతున్నారు. ఇదంతా చూస్తున్న సాధారణ జనం ఇది కదా అసలైన ఇండియా అంటూ మురిసిపోతున్నారు.
ఇక్కడ ఒక ఆశ్చర్యం ఉంది. ఒక ముస్లిం వీధి వ్యాపారిని “ఫుడ్ జిహాద్” అని ఆరోపిస్తూ యూట్యూబర్ చేసిన వీడియో వైరల్ అయిన తర్వాత, అతనికి మద్దతుగా వచ్చిన స్థానికుల యొక్క అనేక వీడియోలు ఇప్పుడు ప్రచారంలో ఉన్నాయి.
నిజాయితీపరులను, పేదలను వర్గీకరించడం, లక్ష్యంగా చేసుకోవడం మరియు అవమానించడం ద్వారా అభిప్రాయాలను వెంబడించే వారికి తగిన ప్రతిస్పందన… pic.twitter.com/DNxt930BFU– మహ్మద్ జుబైర్ (@zoo_bear) ఫిబ్రవరి 13, 2026

